Chandrababu : ఉమ్మడి కృష్ణా జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు టూర్ కొనసాగుతోంది. గురువారం రెండోరోజు గుడివాడలో జరిగే ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించనున్నారు. అలాగే నిమ్మకూరులో జరిగే ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లోనూ పాల్గొంటారు. చంద్రబాబు పాల్గొనే కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు టీడీపీ నాయుకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో చంద్రబాబు మూడురోజులు పర్యటిస్తారు.
‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం తొలిరోజు మచిలీపట్నంలో బుధవారం నిర్వహించారు. ఈ సభలో చంద్రబాబు ఏపీ ప్రభుత్వంపై నిప్పులు కక్కారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా భూకబ్జాలే జరుగుతున్నాయని ఆరోపించారు. మద్యం అమ్మకాల్లో రూ. 35 వేల కోట్లు జగన్ కొట్టేశారని విమర్శించారు. ఎనిమిదిసార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచారని.. చెత్తపైనా పన్ను వేశారని మండిపడ్డారు.
పులివెందులలో బస్టాండ్ కట్టలేని వ్యక్తి మూడు రాజధానులు కడతారా అంటూ చంద్రబాబు మండిపడ్డారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అన్యాయంగా 55 రోజులు జైలులో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు.