New type of Robots : సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందుతుంది అన్నది తెలిసిన విషయమే. కానీ ఇందులో కూడా రోబోటిక్స్, స్పేస్ రంగాలు ఇతర రంగాలకంటే వేగంగా అభివృద్ధిని సాధిస్తున్నాయి. అందుకే ప్రపంచ దేశాలు అన్ని ఈ రెండు రంగాల్లో ముఖ్యంగా పోటీపడుతూ ముందుకెళ్తున్నారు. ఇక రోబోటిక్స్ రంగంలో కొత్త తరహా రోబోలు తయారు చేయాలని శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
అచ్చం మనిషి లాగా కనిపించే, మాట్లాడే, ఆలోచించే రోబోలు తయారు చేయాలని శాస్త్రవేత్తల లక్ష్యం. కానీ అలాంటి లక్ష్యాన్ని సాధించాలంటే ముందుగా జంతువుల సాయం తీసుకోవాలని వారు అంటున్నారు. అందుకే రోబోటిక్స్ రంగంలో రకరకాల జంతువులతో ప్రయోగాలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పటికే ఒక కీటకం యొక్క వాసన పీల్చే శక్తితో రోబోలు తయారయ్యాయి. అలాగే కప్ప మెదడుతో తయారైన రోబోలు కూడా మార్కెట్లో హల్చల్ చేయనున్నాయి. ఇక త్వరలోనే మరో కొత్త రకం రోబోలను తయారు చేస్తామంటున్నారు శాస్త్రవేత్తలు.
ప్రస్తుతం బయో హైబ్రిడ్ రోబోల తయారీ రోబోటిక్స్ రంగంలో ఊపందుకుంది. జంతువులలోని బయో సిస్టమ్స్ను, రోబోలలో అమర్చడం వల్ల ఈ బయో రోబోల తయారీ జరుగుతుంది. కానీ ఇప్పటికీ ఇవి పూర్తిస్థాయిలో తయారు కాలేదు. జంతువులలో ఉండే శారీరిక శక్తులు, ఆలోచన మార్పులు లాంటివి రోబోలలో అమర్చడం అనేది శాస్త్రవేత్తలకు చిక్కుముడిలాగా మారింది. అందుకే వారు పూర్తిగా ఈ పరిశోధనల్లో నిమగ్నమయి ఉన్నారు.
రోబోల యాక్షన్స్ను డిసైడ్ చేయడం కోసం వారిలో యాక్ట్యువేటర్స్ను అమర్చాలని శాస్త్రవేత్తలు నిర్ణయించుకున్నారు. యాక్ట్యువేటర్స్ అనేవి రోబోలు ఎలా నడవాలి, ఎలా కూర్చోవాలి, ఏం చేయాలి అని విషయాలను వాటికి సూచిస్తూ ఉంటాయి. యాక్ట్యువేటర్స్ను అమర్చిన రోబోలు డిఫెన్స్లో ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. అందుకే రోబోటిక్స్ రంగానికి డిఫెన్స్ నుండి ప్రోత్సాహంతో పాటు ఆర్థిక సాయం కూడా అందుతోంది.
వచ్చే అయిదేళ్లలో రోబోలలో లివింగ్ మెటీరియల్స్ను ఎలా అమర్చాలి, వాటి జీవితకాలాన్ని ఎలా పెంచాలి అనే అంశాలపై పరిశోధనలు జరగనున్నాయి. అయిదేళ్ల లోపు ఈ కొత్త రోబోలు మార్కెట్లోకి లాంచ్ అవ్వాలని శాస్త్రవేత్తలు లక్ష్యంగా పెట్టుకున్నారు. బయో యాక్ట్యువేటర్స్ అమర్చిన రోబోలు.. వాటి పర్యావరణాన్ని బట్టి ఎలా ప్రవర్తించాలో తెలుసుకుంటాయి. అందుకే ఎలాంటి పర్యావరణానికి అయినా అలవాటు పడిపోతాయి. దీని కారణంగానే బయో యాక్టువేటర్స్ అనేవి రోబోటిక్స్ భవిష్యత్తును నిర్ణయిస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.