AP: మొక్కే కదాని పీకేస్తే.. పీక కోస్తా. ఇది సినిమా డైలాగ్. స్టిక్కరే కదాని పీకేస్తే.. పోలీసులకు చెబుతా. ఇది రియల్ పొలిటికల్ డైలాగ్.
ఏపీలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరిస్తూ.. స్టిక్కర్లు వేస్తున్నారు వైసీపీ నేతలు, వాలంటీర్లు. అలా విజయవాడలోని ఓ ఇంటికి కూడా జగన్ ఫోటో ఉన్న స్టిక్కర్ వేశారు.
కట్ చేస్తే, అదే రోజు రాత్రి ఓ ఘటన జరిగింది. గోడకు అంటించి ఉన్న జగన్ ఫోటోతో ఉన్న స్టిక్కర్ను ఓ కుక్క పీకేసింది. ఆ పోస్టర్ తీసేసేందుకే అది వచ్చినట్టు.. వచ్చిరాగానే నోటితో స్టిక్కర్ను లాగేసి.. స్టిక్కర్ను నోట కరుచుకొని అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇదంతా ఓ వ్యక్తి తన సెల్ఫోన్లో రికార్డు చేశాడు. ఆ వీడియో ఫుల్ వైరల్ అయింది.
కట్ చేస్తే.. జగన్ స్టిక్కర్ను పీకేసిందంటూ పోలీసులకు.. కొందరు ఫిర్యాదు చేయడం ఆసక్తిగా మారింది. రిటర్న్ కంప్లైంట్తో పాటు కుక్క స్టిక్కర్ను లాగేస్తున్న వీడియోను తమ కంప్లైంట్కు జత చేశారు. ఏకంగా పోలీస్ స్టేషన్కే వెళ్లి మరీ కేసు పెట్టాలని కోరారు స్థానికులు.
ఇక, సోషల్ మీడియాలో ఈ వీడియో బాగా సర్క్యూలేట్ అవుతోంది. అది టీడీపీ కుక్క కావొచ్చని కొందరు.. ఇంటికి జగన్ ఫోటో ఉన్న స్టిక్కర్ వేయడం కుక్కకు కూడా నచ్చటం లేదని మరికొందరు.. టీడీపీ వాళ్లే కావాలనే ఆ కుక్కను ఉసిగొల్పారని ఇంకొందరు.. ఇలా రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
అయితే, కుక్కపై పోలీసులకు ఫిర్యాదు చేయడం వెనుక రాజకీయ కోణం కూడా ఉంది. తమ ఇంటికి అంటించిన జగన్ స్టిక్కర్లను తీసేశారు కొందరు టీడీపీ కార్యకర్తలు. వారిపై పోలీసులు కేసు పెట్టడంపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ మీద కేసు పెట్టినట్టే.. స్టిక్కర్ను పీకేసి.. సీఎంను అవమానించన కుక్కపైనా కేసు పెట్టి, దాన్ని పట్టుకోవాలని పోలీసులకు కొందరు టీడీపీ నాయకులు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. ఏపీ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే మరి.