CM: తెలుగు రాష్ట్రాల సీఎంలు తమకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. అత్యంత ధనవంత సీఎంలలో జగన్ మోహన్ రెడ్డి టాప్ ప్లేస్ లో ఉన్నారు. అప్పులు ఎక్కువగా ఉన్న సీఎంల జాబితాలో ఫస్ట్ ప్లేస్ కేసీఆర్దే.
28 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల సీఎంల ఆస్తులు, అప్పులు, కేసులపై అసోసియేషన్ ఫర్ డెమెక్రటిక్ రీఫామ్స్ , నేషనల్ ఎలక్షన్ వాచ్ సంయుక్తంగా సర్వే చేపట్టింది. గత ఎన్నికల సందర్భంగా ఆయా రాష్ట్రాల సీఎంలు ఇచ్చిన అఫిడవిట్ల ఆధారంగానే ఈ సర్వే చేశారు. సర్వేలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా జగన్ మోహన్ రెడ్డి నిలిచారు. జగన్ ఆస్తులు దాదాపుగా 510 కోట్లు. ధనిక సీఎంల జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరో స్థానంలో నిలిచారు. కేసీఆర్ ఆస్తులు 23 కోట్ల 55 లక్షలుగా ఉన్నాయి. ఇక జగన్ తర్వాతి స్థానాల్లో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమాఖండు, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఉన్నారు. పెమాఖండుకు 163 కోట్లు, నవీన్ పట్నాయక్ 63 కోట్ల ఆస్తులు ఉన్నాయని సర్వేలో వెల్లడైంది. ఇక అత్యంత బీద సీఎంగా పశ్చిమబెంగాల్ నుంచి మమతాబెనర్జీ ఉన్నారు. ఆ తర్వాత కేరళ సీఎం పినరయి విజయన్, హర్యానా సీఎం మనోహర్ లాల్ ఉన్నారు. మమత ఆస్తి కేవలం 15 లక్షలేనట. విజయన్, మనోహర్ లాల్ కోటికిపైగా ఆస్తులను కలిగి ఉన్నట్టు సర్వేలో తేలింది.
అత్యధిక ఆస్తులు కలిగిన జాబితాలో జగన్ టాప్ ప్లేస్ లో ఉంటే.. అత్యధిక అప్పులు ఉన్న సీఎంలలో కేసీఆర్ ముందు ఉన్నారు. కేసీఆర్ కు 8కోట్లకుపైగా అప్పులు ఉన్నాయి. ఆ తర్వాతిస్థానాల్లో కర్ణాటక, మహారాష్ట్ర సీఎంలు ఉన్నారు. బసవరాజ్ బొమ్మైకు 4కోట్లు, ఏక్ నాథ్ షిండేకు 3కోట్లకుపైగా అప్పులు ఉన్నాయి. ఇక 13 మంది ముఖ్యమంత్రులపై సీరియస్ క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. ఇందులోనూ తెలంగాణ సీఎం కేసీఆర్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు.కేసీఆర్ పై మొత్తం 64 కేసులు ఉండగా.. అందులో 37 కేసులు సీరియస్ వి. ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు, ఏపీ, మహారాష్ట్ర, ఢిల్లీ సీఎంలు ఉన్నారు.
30 మంది ముఖ్యమంత్రుల్లో కేవలం ఒక్కరు మాత్రమే మహిళ ఉన్నారు. పదో తరగతి వరకు మాత్రమే చదువుకున్న సీఎం కూడా ఒక్కరే ఉన్నారు. ఇంటర్మీడియట్ వరకు చదివిన వాళ్లు ముగ్గురు, గ్రాడ్యుయేట్లు 11 మంది, గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ నుంచి నలుగురు ఉన్నారు. ఇక పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివిన ముఖ్యమంత్రుల జాబితాలో 9 మంది ఉండగా.. డాక్టరేట్, డిప్లమా చదివిన వాళ్లు ఒక్కొక్కరు ఉన్నారు.