Jagan : ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ ప్రతిపక్షాలపై ఎదురుదాడిని మరింత పెంచారు. తాజాగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఈబీసీ నేస్తం నిధులను విడుదల చేశారు. రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతోపాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన 4,39,068 మంది పేద మహిళల ఖాతాల్లో రూ.658.60 కోట్లు జమ చేశారు. బహిరంగ సభలో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మాటల తుటాలు పేల్చారు. 2014-19 మధ్య ఇంటింటికి ఎంత మంచి జరిగింది? తన హయాంలో జరిగిన మంచి ఎంతో బేరీజు వేసుకోవాలని కోరారు. ఇదే చంద్రబాబుకు తన ఛాలెంజ్ అని అన్నారు. రుణ మాఫీ చేస్తానని రైతులను చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు.
టిడ్కో ఇళ్ల ముందు చంద్రబాబు సెల్ఫీ తీసుకుని ఛాలెంజ్ చేసిన అంశంపై జగన్ ఘాటుగా స్పందించారు. సెల్ఫీ ఛాలెంజ్ అంటే నాలుగు ఫేక్ ఫోటోలు కాదన్నారు. సెల్ఫీ ఛాలెంజ్ అంటే ప్రతీ ఇంటికి వెళ్లి ఏం చేశారో చెప్పాలని సవాల్ చేశారు. ప్రజలు మంచి చేశారు అని చెబితే అప్పుడు వారితో సెల్ఫీ తీసుకోవాలన్నారు.
దేశంలో ఈబీసీ నేస్తం లాంటి పథకం ఎక్కడా లేదని జగన్ అన్నారు. రెండేళ్లలో రూ.1,258 కోట్లు ఈ పథకం ద్వారా మహిళల ఖాతాల్లో జమ చేశామన్నారు. 46 నెలల పాలనలో రూ. 2.07 లక్షల కోట్లు డీబీటీ ద్వారా లబ్ధిదారులకు అందించామని తెలిపారు. మహిళా సాధికారిత కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టామన్నారు. మహిళలకు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చామన్నారు. ఈబీసీ నేస్తం, కాపు నేస్తం పథకాలు మేనిఫెస్టోలో లేకపోయినా అమలు చేస్తున్నామన్నారు. మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్ స్పష్టం చేశారు.
గత ప్రభుత్వంలో ఇలాంటి సంక్షేమ పథకాలు ఉన్నాయా? అని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో ఎన్ని పథకాలున్నాయి? అని నిలదీశారు. టీడీపీ పాలనలో ఏం జరిగిందో ఆలోచించాలని ప్రజలను జగన్ కోరారు.