Dangerous Odors :- మామూలుగా మనిషికి అయిదు సెన్సెస్ ఉంటాయి. కొందరికి అందులో ఏదో ఒక సెన్స్ చాలా గట్టిగా పనిచేస్తుంది. ఈరోజుల్లో వాసనను ఇట్టే పసిగట్టేసే వారు ఎక్కువ ఆరోగ్య సమస్యలకు లోనయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఎందుకంటే ఈరోజుల్లో పెరుగుతున్న కాలుష్యం వల్ల అనేక రకాల కెమికల్స్ గాలిలోనే కలుస్తున్నాయి. ఇవి వాసన రూపంలో మనుషులను చేరుకుంటున్నాయి. అందుకే వీటి వల్ల కలిగే ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడానికి శాస్త్రవేత్తలు కొత్త టెక్నాలజీని సృష్టించారు.
ఆరోగ్యానికి హాని కలిగించే కాలుష్యం వల్ల ఏర్పడే వాసనలు ఈమధ్య గాలిలో ఎక్కువగా కలుస్తున్నాయి. ఇవి కళ్లు, ముక్కు, ఊపిరితిత్తులపై కూడా ప్రభావం చూపిస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సెప్టిక్ ట్యాంక్స్, డ్రైనేజ్ సిస్టమ్స్, చెత్తను కాల్చడం వల్ల వచ్చే వాసనలు కూడా ఇందులో భాగమే అని వారు అన్నారు. ఇలాంటి వాటి నుండి వెలువడే గ్యాసులు మనుషుల ఆరోగ్యానికి మాత్రమే కాకుండా పర్యావరణానికి కూడా హాని కలిగిస్తాయని వారు తెలిపారు. అందుకే వీటి నుండి వెలువడే గ్యాసులను అదుపు చేయాలని ఇప్పటికే శాస్త్రవేత్తలు ఎన్నో విధాలుగా ప్రయత్నించారు.
గాలిలోని హానికరకమైన వాసనలను పోగొట్టాలంటే కార్బన్ను ఉపయోగించాల్సి ఉంటుంది. కానీ కార్బన్ వినియోగం అంత మెరుగైన రిజల్ట్స్ను అందించదని తెలుసుకున్న శాస్త్రవేత్తలు.. కొత్త విధానాలు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ ప్రయత్నాల్లోనే వారు కార్బన్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీని కనిపెట్టారు. దీని వల్ల గాలిలో కలిసే నాలుగు నైట్రోజన్ కాంపౌండ్స్ అయిన అమోనియా, ఎథిలమైన్, డిమెథిలమైన్, ట్రైమెథిలమైన్ యొక్క వాసనలను పోగొట్టవచ్చని వారు అంటున్నారు.
ఇదివరకు ఉన్న కార్బన్ పద్ధతులతో పోలిస్తే.. కొత్తగా కనిపెట్టిన కార్బన్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ ద్వారా గాలిలో నుండి వాసనలను 38 రెట్లు ఎక్కువ మెరుగ్గా పోగొట్టవచ్చని శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ టెక్నాలజీ సాయంతో గాలిలోని నుండి మరెన్నో హానికరకమైన గ్యాసులను తొలగించే మరెన్నో టెక్నాలజీలను తయారు చేసే అవకాశం ఉందని వారు అన్నారు. ఆ టెక్నాలజీలతో ఫిల్టర్స్, మాస్కులు లాంటివి కూడా తయారు చేసి ప్రజలకు అందించవచ్చని వారు భావిస్తున్నారు.