Revanth Reddy Comments on KCR : కేసీఆర్ రాజకీయాలను మాఫియాగా మార్చారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. 2 కుటుంబాలకు రూ. 2500 కోట్ల విలువైన భూములు కట్టబెట్టారని.. ఈ సంపద పేదలకు చెందాలన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవోలే ఇందుకు సాక్ష్యమని రేవంత్ తెలిపారు. ఆ జీవోల ఆధారంగానే తాను ఈ వివరాలు వెల్లడిస్తున్నానని చెప్పారు. కేసీఆర్ పై సామాజిక బహిష్కరణ విధించాలని స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్ భూదందా చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. ఓ కార్పొరేట్ ఆస్పత్రికి ప్రభుత్వ భూములు కట్టబెట్టారని ఆరోపించారు. తమ అనుచరులకు భూములు కట్టబెడుతున్నారని.. సీఎం కేసీఆర్ విధానాలు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయన్నారు. 2012లోనే ఖానామెట్లో ఎకరా రూ.12 కోట్లుగా నిర్ణయించారని తెలిపారు. తక్కువ ధరకు భూములు పొందిన కంపెనీలకు హెచ్ఎండీఏ నోటీసులిచ్చిందని వివరించారు.
అలెగ్జాండ్రియా ఫార్మా , మారుతీ సుజుకీకి నోటీసులు ఇచ్చిందన్నారు. మారుతీ సుజుకీ ఎకరా రూ.12 కోట్ల చొప్పున చెల్లించిందన్నారు. భూమి ధరల విషయంలో అలెగ్జాండ్రియా ఫార్మా కోర్టు కెళ్లిందన్నారు. అలెగ్జాండ్రియా ఫార్మాకు కేటాయించిన భూములపై కేసీఆర్ కుటుంబం కన్ను పడిందన్నారు. కార్పొరేట్ ఆస్పత్రికి భూములిచ్చేందుకే ఫార్మా కంపెనీపై ఒత్తిడి చేశారని రేవంత్ ఆరోపించారు.
రవీంద్రరావు, జగన్నాథరావు కలిసి.. అలెగ్జాండ్రియా ఫార్మా భూములు కొట్టేయాలనుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఫార్మా కంపెనీలో రవీంద్రరావు, జగన్నాథరావు బలవంతంగా చేరారని.. ఆ ఇద్దరూ హైకోర్టులో కేసు గెలుచుకుని.. ఆ భూమిని దక్కించుకున్నారన్నారు. ఈ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లలేదని ఆయన ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ తన బంధువులకు ఇలా 5 ఎకరాలను పరోక్షంగా కట్టబెట్టారని ఆరోపించారు. హైటెక్ సిటీ వద్ద గజం రూ. 80 వేలున్న భూమిని రూ.36 వేలకే ఎలా ఇచ్చారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.