Artificial Intelligence : ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ).. రోజురోజుకీ టెక్నాలజీ రంగంలో దీని పేరు మారుమోగిపోతోంది. ఎన్నో ప్రముఖ టెక్ సంస్థలు కూడా ఏఐపై ఇప్పటికే పూర్తిగా ఆధారపడ్డాయి అని చెప్పడంలో ఆశ్చర్యంలో లేదు. అయినా కూడా ఇంకా ఏఐను ఎంతో అభివృద్ధి చేయాలని పరిశోధకులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా ఒక మనిషి గొంతును విని వారు అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారా లేదా అని తెలుసుకోవడం కోసం ఏఐను ఉపయోగించాలనుకుంటున్నారు.
మైక్రోసాఫ్ట్ నుండి బింగ్, ఓపెన్ ఏఐ నుండి చాట్ జీపీటీ, గూగుల్ నుండి బార్డ్ వంటి టెక్నాలజీలు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ క్రేజ్ మరింత పెరిగిపోయింది. అందుకే ఒక మనిషి గొంతు విని వారికి జలుబు ఉందా లేదా తెలుసుకోవడానికి ఏఐను ఉపయోగించాలని పరిశోధకులు నిర్ణయించుకున్నారు. అదే దిశగా పరిశోధనలు కూడా మొదలుపెట్టారు. అవి దాదాపు సక్సెస్ కూడా అయినట్టు తెలుస్తోంది.
మామూలుగా ఉద్యోగులు ఆరోగ్యంగా ఉన్నా కూడా అప్పుడప్పుడు వారు పని నుండి తప్పించుకోవడానికి జలుబు, జ్వరం లాంటి కారణాలు చెప్పి సిక్ లీవ్స్ తీసుకుంటూ ఉంటారు. అలాంటి ఫేక్ లీవ్స్ తీసుకునే ఉద్యోగులను కనిపెట్టడం కోసం ఏఐ సిద్ధమయినట్టు తెలుస్తోంది. ఒక మనిషి గొంతు విన్న ఏఐ.. వారు జలుబుతో బాధపడుతున్నారో లేదో కనిపెట్టేలాగా కొత్త ఫీచర్ను తయారు చేశారు పరిశోధకులు. కానీ ఈ ఫీచర్ మార్కెట్లోకి రావడానికి మరికాస్త సమయం పట్టేలాగా అనిపిస్తోంది.
ఇప్పటికే 630 మందిపై ఈ కోణంలో పరిశోధనలు జరిగాయి. ఇందులో 111 మందికి జలుబు ఉందన్న విషయాన్ని కేవలం వారి గొంతు మాత్రమే విని ఏఐ కనిపెట్టేసింది. దీని కోసం ఏఐ హార్మోనిక్స్ను ఉపయోగించిందని పరిశోధకులు చెప్తున్నారు. జలుబుతో బాధపడుతున్న వ్యక్తి గొంతులో ఫ్రీక్వెన్సీ అనేది మారుతుందని, దాని ద్వారా వారికి జలుబు ఉందన్న విషయాన్ని ఏఐ కనిపెట్టేస్తుందని వారు తెలిపారు. వారు చేసిన ఈ పరిశోధనల్లో ఏఐ 70 శాతం సక్సెస్ సాధించిందని బయటపెట్టారు పరిశోధకులు.