AP CID : తాజాగా ఏపీలో టీడీపీని సీఐడీ టార్గెట్ చేసింది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఐడీ అధికారులు వెళ్లారు. టీడీపీ జనరల్ సెక్రటరీ పేరిట నోటీసులు కూడా అందించారు. టీడీపీ అనుబంధ పత్రిక చైతన్య రథంలో వచ్చిన వార్తా కథనాలపై సీఐడీ వివరాలు సేకరించినట్లు సమాచారం. ఆ పత్రిక ఎడిటర్ ఎవరు? ఎవరు నిర్వహిస్తున్నారని సీఐడీ అధికారులు ఆరా తీశారు. అక్కడి లాయర్ చేతికి నోటీసులు అందించారు.
ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసిందని తెలుస్తోంది. చైతన్య రథం ప్రతిక తనపై తప్పుడు కథనాలు ప్రచురించిందనేది బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపణ. ఎన్నికల కమిషన్కు బుగ్గన సమర్పించిన అఫిడవిట్లో స్థిర, చర ఆస్తులపై టీడీపీ పత్రిక తప్పుడు రాతలు రాసిందని అంటున్నారు. దీంతో ఆ పత్రికపై ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది సీఐడీ.
మొన్నటి వరకు ఏపీ సీఐడీ మార్గదర్శి కార్యాలయాలపై దాడులు చేసింది. హైదరాబాద్ లో ఏప్రిల్ 3న రామోజీరావును సీఐడీ అధికారులు సుధీర్ఘంగా ప్రశ్నించారు. ఆ సమయంలో రామోజీరావు బెడ్ పై పడుకున్న ఫోటో బయటకు రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. విచారణ సమయంలో తీసిన ఫోటో బయటకు రావడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దాదాపు 5 గంటలపాటు 46 ప్రశ్నలు సంధించారు. సీఐడీ అధికారులు అడిగినన ప్రశ్నలకు.. రామోజీరావు సమాధానాలిచ్చారు. లిఖితపూర్వకంగా కోరితే అదనపు సమాచారం కూడా అందజేస్తానని స్పష్టం చేశారు.
ఆ తర్వాత ఏప్రిల్ 6న మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ను ఏపీ సీఐడీ అధికారులు విచారించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఆమె నివాసంలో ఏడు గంటలపాటు ప్రశ్నించారు. విచారణ కోసం పది రోజుల క్రితం సీఐడీ అధికారులు నోటీసు ఇచ్చారు. సీఐడీ విభాగం ఎస్పీ అమిత్ బర్దార్, ఎస్పీ రత్న, అదనపు ఎస్పీ రవివర్మ, దర్యాప్తు అధికారి రవికుమార్ నేతృత్వంలోని 20 మంది సీఐడీ బృందం ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసింది. శైలజా కిరణ్ విచారణను వీడియో తీశారు.
సీఐడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు శైలజా కిరణ్ సమాధానాలిచ్చారు. మార్గదర్శి చిట్ఫండ్ చట్ట ప్రకారమే వ్యాపారాన్ని నిర్వహిస్తోందని, ఎలాంటి ఉల్లంఘనలూ జరగలేదని చెప్పారు. మార్గదర్శి వ్యాపారంలో వచ్చిన లాభాలను మాత్రమే పెట్టుబడులుగా వినియోగించినట్లు తెలిపారు. విచారణ అనంతరం ఆ వాంగ్మూలాన్ని రికార్డు చేసేందుకు అధికారులు సుమారు 3 గంటల సమయం తీసుకున్నారు.
ఏప్రిల్ 13న మరోసారి విచారిస్తామని సీఐడీ అధికారులు సమాచారం ఇచ్చారు. ఈసారి విచారణ అమరావతిలో ఉండే అవకాశం ఉంటుందన్నారు. ఈ కేసులో అవసరమైతే రామోజీరావుకు మరోసారి సమాచారమిచ్చి, విచారిస్తామని చెప్పారు. ఒకవేళ నోటీసు ఇస్తే ఈసారి ఆయనను కూడా అమరావతిలోనే విచారించే అవకాశం ఉందన్నారు. ఇలా ఒక వైపు మార్గదర్శి ఎపిసోడ్ లో సీఐడీ యాక్షన్ కొనసాగుతోంది. తాజాగా టీడీపీ ఆఫీసులపై దాడుల మొదలుకావడంతో ఏపీలో పొలిటికల్ హీట్ మరింత పెరిగే అవకాశం ఉంది.