Nirmala Sitharaman : పశ్చిమ దేశాలకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె అమెరికాలో పర్యటిస్తున్నారు. వాషింగ్టన్ లో పీటర్సన్ ఇన్సిస్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ లో జరిగిన చర్చలో పాల్గొన్నారు. భారత్ లో ముస్లింలపై హింస, ప్రతిపక్ష ఎంపీలపై అనర్హత లాంటి అంశాలపై ఆమెకు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆ ప్రశ్నలకు నిర్మలా సీతారామన్ దీటుగా కౌంటర్ ఇచ్చారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ముస్లిం జనాభా ఉన్న దేశం భారత్ అని పేర్కొన్నారు. ఇస్లామిక్ దేశమైన పాకిస్థాన్ కంటే భారత్లోనే ముస్లింల జీవనం మెరుగ్గా ఉందని స్పష్టం చేశారు.
భారత్ లో ముస్లింల సంఖ్య పెరుగుతోందని నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశంలో వారి జీవితాలు కష్టంగా ఉంటే 1947 నాటి కంటే వారి జనాభా ఇంత పెరగగలదా? అని ప్రశ్నించారు. ఇస్లామిక్ దేశంగా ఏర్పడిన పాకిస్థాన్లో ప్రస్తుతం మైనార్టీల పరిస్థితి దారుణంగా ఉందని స్పష్టం చేశారు. అక్కడ ముస్లింల జనాభా తగ్గిపోతున్న విషయాన్ని గుర్తు చేశారు. భారత్ లో ఆ పరిస్థితి లేదన్నారు. భారత్లో ముస్లింలపై దాడులు జరుగుతున్నాయన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు. వాస్తవ పరిస్తితులు ఏమాత్రం తెలుసుకోకుండా నిందించడం తగదన్నారు.
భారత్లో ఉన్న ముస్లింలు.. పాకిస్థాన్ ప్రజల కంటే మెరుగ్గా జీవిస్తున్నారని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. భారత్ లో ముస్లింలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వార్తలు రాసిన వారు భారత్కు రావాలని ఆహ్వానించారు. దేశవ్యాప్తంగా తిరిగి వాస్తవాలు గమనించాలని కోరారు. ముస్లింలపై దాడుల ఆరోపణలను రుజువు చేయాలని సవాల్ విసిరారు.
అంతర్జాతీయ ద్రవ్య నిధి-IMF, ప్రపంచ బ్యాంకుతో సహా వివిధ సమావేశాలకు హాజరయ్యేందుకు నిర్మలా సీతారామన్ అమెరికా వెళ్లారు. భారత్ లో పెట్టుబడులపై పాశ్చాత్య మీడియాలో వ్యతిరేకంగా వస్తున్న కథనాలను తప్పుబట్టారు. తనకంటే భారత్కు వస్తున్న పెట్టుబడిదారులే దీనికి సరైన సమాధానం చెబుతారని అన్నారు. భారత్ లో పెట్టుబడులను పెట్టేందుకు ఆసక్తి ఉన్న వారు ఎవరో చెప్పింది వినడం కంటే.. భారత్కు వచ్చి.. దేశంలో వాస్తవంగా ఏం జరుగుతుందో ఒకసారి చూడాలని సూచించారు.