Jagan : 2019 ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో కోడికత్తితో దాడి జరగడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. తాజాగా ఈ కేసులో సీఎం జగన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో జరుగుతోంది. జగన్ విచారణకు హాజరుకావాలని గత విచారణ సమయంలో మెజిస్ట్రేట్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో తాజాగా జగన్ పిటిషన్ వేశారు. అడ్వకేట్ కమిషనర్ ద్వారా సాక్ష్యం నమోదుకు అవకాశం ఇవ్వాలని కోరారు.
రాష్ట్రానికి సీఎంగా అనేక బాధ్యతలున్నాయని జగన్ పిటిషన్ లో పేర్కొన్నారు.పేదలకు అందించే సంక్షేమ పథకాలపై సమీక్ష సమావేశాలు ఉన్నాయని తెలిపారు. కోర్టుకు సీఎం హాజరైతే భద్రత కోసం వచ్చే వాహనాలతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. అడ్వకేట్ కమిషనర్ను నియమించి ఆయన సమక్షంలో సాక్ష్యం నమోదు చేయించాలని కోరారు.
ఈ కేసు దర్యాప్తును లోతుగా జరపాలని కోరుతూ మరో పిటిషన్ను కూడా సీఎం జగన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఈ నెల 13న విచారణ జరుపుతామని ఎన్ఐఏ కోర్టు ప్రకటించింది.