Governor : పెండింగ్ బిల్లులపై తెలంగాణ గవర్నర్ తమిళసై కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడింటిని ఆమోదించారు. రెండు బిల్లులను ప్రభుత్వానికి తిప్పిపంపారు. మరో రెండు బిల్లులను రాష్ట్రపతి పరిశీలన కోసం పంపారు. ఇంకో రెండు బిల్లులను మాత్రం పెండింగ్ లో పెట్టారు.
పెండింగ్ బిల్లులపై ప్రభుత్వానికి, గవర్నర్ మధ్య కొంతకాలంగా వార్ నడుస్తోంది. 5 నెలలపాటు గవర్నర్ ఏ బిల్లుకు ఆమోదం తెలపకపోవడంతో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2022 సెప్టెంబర్ 14 నుంచి 2023 ఫిబ్రవరి 13 మధ్యకాలంలో 10 బిల్లులను పంపినా గవర్నర్ ఆమోదముద్ర వేయలేదని గత నెలలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం రాష్ట్ర శాసనసభ బిల్లును పాస్ చేసి పంపినప్పుడు ఆమోదముద్ర వేయడం, సమ్మతిని నిలుపుదల చేయడం, రాష్ట్రపతి పరిశీలన కోసం పంపడం, మళ్లీ శాసనసభకు పంపడం ఈ నాలుగు అంశాల్లో ఏదో ఒకదాన్ని గవర్నర్ అనుసరించాలని పిటిషన్ లో పేర్కొంది. అలా చేయకుండా బిల్లులను నిరవధికంగా పెండింగ్లో పెట్టడం రాజ్యాంగ నిబంధనల పరిధిలోకి వస్తుందా? శాసనసభ బిల్లులు పాస్ చేసి పంపిన చాలా కాలం తర్వాత కూడా వాటిపై ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయకుండా అలాగే ఉంచుకోవడం రాజ్యాంగబద్ధమేనా? అని తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నించింది. చట్టసభలు ఆమోదించిన బిల్లులను ఇలా పెండింగ్లో పెట్టడమంటే శాసనసభ అధికారాలను రద్దు చేయడం కిందికే వస్తుందని పేర్కొంది.
తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం విచారణ జరిగింది. చట్ట సభలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదులుగా గవర్నర్ కార్యదర్శి, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శులను పేర్కొన్నారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు నివేదిక అందజేశారు. ఇప్పటికే మూడు బిల్లులకు ఆమోదం తెలిపారని గవర్నర్ తరఫు న్యాయవాది తెలిపారు. పంచాయతీరాజ్ సవరణ బిల్లు, ఆజామాబాద్ మిల్లు బిల్లు, మెడికల్ బిల్లులపై వివరణ కోరారని చెప్పారు. విషయ తీవ్రత, ప్రాధాన్యత దృష్ట్యా విధిలేకనే కోర్టును ఆశ్రయించినట్టు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. వాదనల అనంతరం.. తదుపరి విచారణను రెండు వారాలకు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.