BRS Party News :రెబల్స్ పై బీఆర్ఎస్ అధిష్టానం యాక్షన్ మొదలుపెట్టింది. పార్టీ నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ వేటు వేసింది. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రకటించింది.
ఆదివారం రాత్రి కొత్తగూడెంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జూపల్లి కృష్ణారావు కూడా పాల్గొన్నారు. ఈ ఇద్దరు నేతలు కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సింగరేణిని అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు. కార్మికులను అవమానించారని మండిపడ్డారు. సీఎం ఎనిమిదిన్నరేళ్ల కాలంలో చేసిన తప్పులకు శిక్ష అనుభవించక తప్పదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధిష్టానం ఈ ఇద్దరు నేతలపై చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొంతకాలంగా వరుసగా ఆత్మీయ సమ్మేళాలు నిర్వహిస్తున్నారు. ఆయన పార్టీ మారతారనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. కానీ తన రాజకీయ ప్రయాణంపై మాత్రం క్లారిటీ ఇవ్వటంలేదు. తొలుత బీజేపీలో చేరతారని ప్రచారం సాగింది. ఆ తర్వాత ఆయనే పార్టీ పెడతారని వార్తలు వచ్చాయి. ఆ అంశంపైనా ఇప్పటికీ స్పష్టత లేదు. కానీ బీఆర్ఎస్ అధిష్టానంపై పదేపదే విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనపై పార్టీ వేటు వేసింది.
కొంతకాలంగా జూపల్లి కూడా బీఆర్ఎస్ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. 2018 ఎన్నికల్లో మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో ఆయన ఓడిపోయారు. ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డి గెలిచారు. ఆ తర్వాత ఆయన గులాబీ కుండువా కప్పుకోవడంతో జూపల్లికి పార్టీలో ప్రాధాన్యం తగ్గిపోయింది. జూపల్లి, బీరం ఉప్పునిప్పులా మారారు. ఈ నేపథ్యంలో జూపల్లి కృష్ణారావును చల్లార్చేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగారు. కొన్నాళ్ల క్రితం స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. కానీ జూపల్లి మాత్రం పార్టీ అధిష్టానంపై అలక వీడలేదు.
కేసీఆర్ మహబూబ్ నగర్ పర్యటనకు వచ్చినప్పుడు జూపల్లి వెళ్లలేదు. కానీ అదే సమయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డితో భేటీ కావడం ఆసక్తిని రేపింది. ఇలా పార్టీకి అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో పొంగులేటి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇక ఉపేక్షించకుండా బీఆర్ఎస్ అధిష్టానంపై జూపల్లిపై కూడా వేటు వేసింది. మరి ఈ ఇద్దరు నేతల దారెటు..?