BRS : భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించేందుకు గులాబీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 27న పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ విషయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఆ రోజు ఉదయం పార్టీ జెండా ఎగురవేసి కేసీఆర్.. బీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. పలు రాజకీయ తీర్మానాలు ప్రవేశపెట్టి చర్చిస్తారు. ఈ సమావేశంలో 300 మంది పార్టీ ప్రతినిధులు పాల్గొంటారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పార్టీ ఆవిర్భావం రోజు నిర్వహించాల్సిన భారీ సభను అక్టోబర్ 10న వరంగల్ లో నిర్వహిస్తామని కేటీఆర్ తెలిపారు.
ఇప్పటికే రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలకు పార్టీ శ్రేణుల నుంచి మంచి స్పందన వస్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఏప్రిల్ 25న నియోజకవర్గ స్థాయిలో సభలు పార్టీ నియమించిన ఇన్ ఛార్జ్లు, స్థానిక ఎమ్మెల్యేల అధ్యక్షతన జరుగుతాయన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులు ఈ సమావేశాల నిర్వహణను సమన్వయం చేస్తారని చెప్పారు. అన్ని గ్రామాలు, వార్డుల్లో ఆ రోజు ఉదయమే పార్టీ జెండాలు ఎగురవేయాలని పిలుపునిచ్చారు.
గ్రామాలు, వార్డుల్లో జెండా పండుగ కార్యక్రమం ముగిసిన తర్వాత నియోజకవర్గ కేంద్రాల్లో ప్రతినిధులు సభ నిర్వహించుకోవాలని కేటీఆర్ ఆదేశించారు. వేసవి నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జ్లకు సూచించారు.
3 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ ఛార్జ్లను పార్టీ అధినేత కేసీఆర్ నియమించారు. కంటోన్మెంట్ అసెంబ్లీ ఇన్ ఛార్జ్గా మర్రి రాజశేఖర్ రెడ్డి, గోషామహల్ నియోజకవర్గం ఇన్ ఛార్జ్గా నంద కిషోర్ వ్యాస్ బిలాల్, భద్రాచలం నియోజకవర్గ ఇన్ ఛార్జ్గా ఎంపీ మాలోతు కవితను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. మరో 8 నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఈ ఏడాది పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.