Karnataka : కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం హీటెక్కింది. అమూల్ పాల వ్యవహారం కాస్తా పొలిటికల్ టర్న్ తీసుకుంది. కర్ణాటకలో పాల వ్యాపారాన్ని విస్తరిస్తామని అమూల్ ప్రకటించడం అధికార బీజేపీకి చిక్కులు తెచ్చిపెట్టింది. వ్యాపార విస్తరణలో భాగంగా తమ మిల్క్ ప్రొడక్ట్స్ను బెంగళూరులో ప్రారంభిస్తామని అమూల్ సంస్థ ప్రకటించింది. అలాగే నందిని పాల సంస్థను అమూల్లో విలీనం చేయాలనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీంతో ఒక్కసారిగా వివాదం రాజుకుంది.
అమూల్ పాల ఉత్పత్తులను కర్ణాటకలోకి రానిచ్చే ప్రసక్తే లేదంటూ కాంగ్రెస్, జేడీఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమూల్ పాల సరఫరాపై నిషేధం విధించాలని ప్రతిపక్ష నేతలతోపాటు పలు కన్నడ సంస్థలు డిమాండ్ చేశాయి. గుజరాత్కు చెందిన అమూల్కు నందిని బ్రాండ్ ను అప్పగించేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి..
కర్ణాటక పాడి ఉత్పత్తిదార్ల సహకార సంఘాల సమాఖ్యకు చెందిన నందిని బ్రాండ్ పాలకు బెంగళూరు హోటళ్ల యజమానుల సంఘం పూర్తి మద్దతు ప్రకటించింది. ఇకపై నగరంలోని తమ హోటళ్లలో నందిని పాలు, పాల ఉత్పత్తులను మాత్రమే వినియోగిస్తామని ప్రకటించింది. రాష్ట్రంలోని రైతులను ఆదుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని బృహత్ బెంగళూరు హోటల్ అసోసియేషన్ ప్రకటించింది. దీంతో బెంగళూరులో తమ వ్యాపారాన్ని విస్తరింపజేయాలనుకున్న అమూల్ సంస్థకు ఊహించని షాక్ ఎదురైంది. సోషల్మీడియాలో సేవ్ నందిని.. గోబ్యాక్ అమూల్ హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది.
మరి కర్ణాటకలో ఎన్నికల వేళ తలెత్తిన పాల వివాదం ప్రతిపక్షాలకు మేలు చేస్తుందా..? బీజేపీకి షాక్ తగులుతుందా..? బీజేపీ పాల వివాదాన్ని ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తిగా మారింది.