Revanth Reddy News : తెలంగాణలో కాంగ్రెస్ కు పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో జోష్ వచ్చింది. తెలంగాణలో రాహుల్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ నేపథ్యంలో పార్టీకి అదే ఊపును కొనసాగించేందుకు హాత్ సే హాత్ జోడో యాత్రను రేవంత్ రెడ్డి చేపట్టారు. సీతక్క ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గం నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఫిబ్రవరి 6న మేడారం నుంచి తొలివిడత యాత్ర మొదలు పెట్టారు. రేవంత్ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు కదిలారు. ప్రజల కష్టాలను తెలుసుకుని వారికి భరోసా కల్పించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవశ్యకతను ప్రజలకు వివరించారు.
రేవంత్ రెడ్డి పాదయాత్రకు రైతులు, మహిళలు, వృద్ధులు, యువత ఇలా అన్నివర్గాల ప్రజలు మద్దతుగా నిలిచారు. ప్రతినియోజకవర్గంలో జనం భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలోనే కొన్నిచోట్ల కాంగ్రెస్ బ్యానర్లు, ఫ్లెక్సీలను బీఆర్ఎస్ కార్యకర్తలు చించివేయడం వివాదాన్ని రేపింది. వరంగల్ లో ఓ కాంగ్రెస్ కార్యకర్తను చితకబాదారు. ఆస్పత్రికి వెళ్లి స్వయంగా బాధితుడి పరామర్శించిన రేవంత్ రెడ్డి కార్యకర్తల్లో మనోధైర్యం నింపారు.
పాదయాత్రలో భద్రతను పెంచాలని హైకోర్టును ఆశ్రయించారు. దీంతో అదనపు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని తెలంగాణ కోర్టు ఆదేశించింది. రేవంత్రెడ్డి రాత్రి బస చేసే ప్రాంతాల్లోనూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఇలా ఎన్నో ఆటంకాలు ఎదురైనా మార్చి 21 వరకు 35 రోజులపాటు రేవంత్ మొదటి విడత పాదయాత్ర సాగింది. ఇప్పుడు రెండో విడత పాదయాత్రకు రెడీ అవుతున్నారు.
ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలే అజెండాగా రేవంత్ పాదయాత్ర చేపట్టారు. కార్నర్ మీటింగ్స్ లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. రాష్ట్రంలో అధికారం మారాల్సిందేనని స్పష్టం చేశారు. కేసీఆర్ కు జనం బైబై చెప్పాలని పిలుపునిచ్చారు. రైతులు, పేదల కష్టాలను తెలుసుకున్నారు. యువతకు భవిష్యత్ పై భరోసా కల్పించారు. ఏప్రిల్ 12 నుంచి రెండో విడత పాదయాత్ర చేపట్టేందుకు రేవంత్ సిద్ధమవుతున్నారు.