Ponguleti Srinivas Reddy : ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొంతకాలంగా వరుసగా ఆత్మీయ సమ్మేళాలు నిర్వహిస్తూ పార్టీలో అలజడి సృష్టిస్తున్నారు. ఆయన పార్టీ మారతారనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. కానీ తన రాజకీయ ప్రయాణంపై మాత్రం క్లారిటీ ఇవ్వటంలేదు. కారు దిగడం ఖాయమని తేలిపోయినా.. తర్వాత కప్పుకునే కుండువా ఏంటో తేలడంలేదు. తొలుత బీజేపీలో చేరతారని ప్రచారం సాగింది. ఆ తర్వాత ఆయనే పార్టీ పెడతారని వార్తలు వచ్చాయి. ఆ అంశంపైనా ఇప్పటికీ స్పష్టత లేదు. తాజాగా కొత్తగూడెంలో భారీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరుకానుండటం ఆసక్తిని రేపుతోంది.
కొంతకాలంగా జూపల్లి కూడా బీఆర్ఎస్ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. 2018 ఎన్నికల్లో మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో ఆయన ఓడిపోయారు. ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డి గెలిచారు. ఆ తర్వాత ఆయన గులాబీ కుండువా కప్పుకోవడంతో జూపల్లికి పార్టీలో ప్రాధాన్యం తగ్గిపోయింది. జూపల్లి, బీరం ఉప్పునిప్పులా మారారు. ఈ నేపథ్యంలో జూపల్లి కృష్ణారావును చల్లార్చేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. కానీ జూపల్లి మాత్రం పార్టీ అధిష్టానంపై అలక వీడలేదు.
కేసీఆర్ మహబూబ్ నగర్ పర్యటనకు వచ్చినప్పుడు జూపల్లి వెళ్లలేదు. కానీ అదేసమయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డితో భేటీ కావడం ఆసక్తిని రేపింది. పార్టీకి అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్న జూపల్లి గులాబీ పార్టీకి గుడ్ బై చెబుతారని తెలుస్తోంది. అయితే ఆయన ఏ పార్టీలో చేరతారనేది ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో పొంగులేటి నిర్వహించే ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొననుండటం ఆసక్తిని రేపుతోంది.
పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నా పొంగులేటిపై బీఆర్ఎస్ అధిష్టానం యాక్షన్ తీసుకులేదు. అలాగని పొంగులేటి పార్టీకి గుడ్ బై చెప్పడంలేదు. పార్టీలో ఉంటూ చాలామంది నేతలను చేరదీస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొంతమంది నేతలు పొంగులేటి వెంటనే నడుస్తున్నారు. ఇంకోవైపు బీఆర్ఎస్ రెబల్స్ కు పొంగులేటి గాలం వేస్తున్నారు. బీఆర్ఎస్ రెబల్స్ కు పొంగులేటి లీడర్ అవుదామనుకుంటున్నారా? కొత్తగూడెం ఆత్మీయసమ్మేళనంలోనైనా పార్టీ మార్పుపై క్లారిటీ ఇస్తారా? ఇంతకీ జూపల్లి దారెటు..?