Corona Virus(National Updates) : దేశంలో కరోనా వైరస్ మరోసారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. తాజాగా 5,357 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 32,814కు పెరిగింది. మరో 11 మంది మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 5, 30, 965 మంది వైరస్ కు బలయ్యారు.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం .. రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ రాష్ట్రప్రభుత్వ ప్రతినిధులతో ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. మహమ్మారి నివారణ, వైద్య వసతుల సన్నద్ధతపై ఆరా తీశారు. సోమ, మంగళవారాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో సన్నద్ధతను పరిశీలించడానికి అన్ని రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలని కోరారు.
కొవిడ్ నాలుగో దశపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని మాండవీయ అన్నారు. ఒమిక్రాన్ వేరియంట్లో వచ్చిన బీఎఫ్-7 ఉత్పరివర్తనమే ఇప్పటి వరకు చివరిదని తెలిపారు. తాజాగా ఎక్స్బీబీ1.16 సబ్ వేరియంట్ ద్వారా కేసులు వ్యాపిస్తున్నాయని వెల్లడించారు. సబ్వేరియంట్లు అంత ప్రమాదకరమైనవి కాదని తెలిపారు.
రోజువారీ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాయి. మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు మళ్లీ నిబంధనల్ని అమల్లోకి తీసుకొస్తున్నాయి. జన సమూహాల్లో ఉన్నప్పుడు కచ్చితంగా మాస్కులు ధరించాలని హర్యానా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రజలు స్వచ్ఛందంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
గర్భిణులు, వృద్ధులు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కేరళ ప్రభుత్వం ఆదేశించింది. దీర్ఘకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులను విమానాశ్రయాల్లో క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. కొవిడ్ పాజిటివ్గా తేలిన ప్రతి శాంపిల్ను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపాలని సూచించింది. ఢిల్లీ, పుదుచ్చేరిలోనూ జనసమూహాల్లో మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేశారు.