Shaktivaneswara Temple:- తమిళనాడులోని కుంభకోణానికి 7 కిలోమీటర్ల దూరంలో తిరుశక్తిమట్టం అనే గ్రామంలో శక్తివనేశ్వర దేవాలయం ఉంది. ఇక్కడ శివుడు పార్వతి కలిసి శివలింగాకారంలో ఉంటారు. చూడటానికి చిత్రంగా ఉంటుంది. క్రీ.శ 1000లో ఉత్తమ చోళుడి తల్లి సెంబియన్ మాదేవి ఈ శక్తివనేశ్వర ఆలయాన్ని నిర్మించారు. పెళ్లికాని అమ్మాయిలు, అబ్బాయిలు తమకు మంచి భాగస్వామి దొరకాలని ఇక్కడ ఎక్కువగా పూజలు చేస్తుంటారు. అంతేకాకుండా మనస్పర్థలు వచ్చి విడిపోయిన భార్యాభర్తలు, విడాకులు తీసుకున్న భార్యాభర్తలు కూడా ఇక్కడ స్వామివారిని కొలుస్తారు. భార్యాభర్తలిద్దరూ లేదా ఎవరైనా ఒక్కరు ఈ దేవాలయం ప్రాంగణాన్ని శుభ్రం చేసి స్వామికి అభిషేకం చేస్తే వారి ఇబ్బందులన్నీ తొలిగిపోతాయని నమ్మకం. అందుకే ఇక్కడకు దంపతులే ఎక్కువగా వస్తారు.
పార్వతి ఒకరోజు శివున్ని చూసి.. తన భర్త అని భావిస్తుంది. ఇక ప్రతి క్షణం మహాశివుని గురించే ఆలోచిస్తూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. పరమశివుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఇక్కడే ఘెర తపస్సు చేసింది. అయినా పరమేశ్వరుడు కరుణించకపోవడంతో ఒంటిపూట మాత్రమే భోజనం చేస్తూ స్వామిని పూజించింది. ఫలితం లేకపోవడంతో పూర్తిగా భోజనం మానేసి కేవలం నీళ్లు తాగుతూ తపస్సు కొనసాగించింది. ఆ తరువాత ఒంటికాలు పై నిలబడి రెండు చేతులూ పైకెత్తి తన తపస్సును కొనసాగించింది. అయినా శివుడు ప్రసన్నం కాకపోవడంతో చివరి ప్రయత్నంగా అగ్నిగుండం మధ్యలో నిలబడి ఆ త్రినేత్రుడి గురించి తపస్సు కొనసాగించింది. ఇలా దాదాపు కొన్ని సంవత్సరాలు పట్టువిడువకుండా పార్వతీ దేవి పరమేశ్వరుడి గురించి తపస్సు చేసింది.పార్వతీ దేవి పట్టుదలకు ముగ్దుడైన శివుడు అగ్నిజ్వాల రూపంలో ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు.
పార్వతిదేవి తన ఎదుట ఉన్నది ఆ పరమశివుడేనని గ్రహించి ఆయనను చల్లబరచడానికి గట్టిగా కౌగిలించుకుంటుంది. వెంటనే పరమశివుడు చల్లబడి శివలింగం రూపం దాలుస్తాడు. ఆ భంగిమను మనం ఇప్పటికీ ఈ దేవాలయంలో చూడవచ్చు. మూలవిరాట్టు కూడా ఇదే స్థితిలో మనకు కనిపిస్తాడు. ఇక ఇక్కడ స్వామిని వనేశ్వర్ అని పిలుస్తారు. అమ్మవారు స్వామిని కౌగిలించుకున్న ప్రదేశం కావడంతో తిరుశక్తిముత్రం అని పిలుస్తారు.