Tirumala : తిరుమల భక్తజనసంద్రంగా మారిపోయింది. కొండపై ఎటువైపు చూసినా భక్తులే దర్శనమిస్తున్నారు. వరుస సెలవులతో తిరుమల క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. దీంతో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 30 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్టమెంట్లు నిండిపోయాయి. ఔటర్ రింగ్రోడ్డు, శిలా తోరణం వరకు క్యూలైన్లు కొనసాగుతున్నాయి.
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, అన్న ప్రసాద కౌంటర్లు, నారాయణగిరి ఉద్యానవనంతోపాటు భక్తులు రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఆహారం, పాలు తాగునీరును టీటీడీ అందిస్తోంది. శ్రీవారి సేవకులు, ఆరోగ్య, విజిలెన్స్ విభాగాలు భక్తులకు సేవలందిస్తున్నాయి.
వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలో శనివారం మధ్యాహ్నం 79 వేల మందికి అన్నప్రసాదం అందించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ క్యూలైన్లలో 80 వేల మందికి పంపిణీ చేశారు. సాధారణం కంటే రెట్టింపుగా అన్నప్రసాదాలు అందించారు. పిల్లలకు ఎప్పటికప్పుడు పాలు అందించారు. శనివారం సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 50 వేల మంది యాత్రికులు శ్రీవారిని దర్శించుకున్నారు.
భక్తుల రద్దీ కారణంగా రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు, ఎస్ఎస్డీ టోకెన్లు, దివ్య దర్శన టోకెన్లు కలిగిన భక్తులు మాత్రమే తిరుమలకు రావాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. జేఈవో వీరబ్రహ్మం ఆధ్వర్యంలో వివిధ విభాగాల ఉన్నతాధికారులు భక్తుల సౌకర్యాలు, క్యూలైన్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సోమవారం ఉదయం వరకు తిరుమలలో రద్దీ కొనసాగే అవకాశం కనిపిస్తోంది.