Revanth Reddy : తెలంగాణలో TSPSC పేపర్ లీకుల వ్యవహారంపై రాజకీయ వేడి మరింత పెరిగింది. ఈ వ్యవహారం వెలుగులోకి రాగానే మంత్రి కేటీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపణలు చేశారు. దీంతో ఇద్దరు ప్రతిపక్ష నేతలకు కేటీఆర్ మార్చి 28న లీగల్ నోటీసు పంపారు. తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని కోరారు. లేదంటే రూ. 100 కోట్ల పరువునష్టం దావాను ఎదుర్కోవాలని హెచ్చరించారు.
కేటీఆర్ పంపిన లీగల్ నోటీసుపై తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి స్పందించారు. లీగల్ నోటీసును వెనక్కి తీసుకోకపోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటానని కౌంటర్ సమాధానం పంపారు. కేటీఆర్ నోటీసుకు ఏడు పేజీల లేఖలో సమాధానమిచ్చారు. ‘మీ క్లయింట్ సరైన వివరాలు మీకు అందించలేదు. మీడియా సమావేశంలో మాట్లాడిన వీడియో సరిగా వినపడట్లేదు’ అని లేఖలో రేవంత్ పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమమే ఉద్యోగాల కేంద్రంగా జరిగిందని రేవంత్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంతో కేటీఆర్కు సంబంధం లేదన్నారు. ఆ సమయంలో ఈ దేశంలో లేనందున ఆ బాధ కేటీఆర్ కు తెలియదన్నారు. TSPSC ఉద్యోగాల విషయంలో నిరుద్యోగుల తరఫున మాట్లాడానని తెలిపారు. TSPSCకి సాంకేతిక పరిజ్ఞానం ఐటీశాఖ అందిస్తుందన్నారు. అలాంటప్పుడు ఆ కేసుతో కేటీఆర్ తనకు సంబంధం లేదని ఎలా చెబుతారని ప్రశ్నించారు.
నేరారోపణలు ఎదుర్కొంటున్న రాజశేఖర్రెడ్డి నియామకం ఐటీశాఖ ద్వారానే జరిగిందని రేవంత్రెడ్డి వెల్లడించారు.
వెంటనే TSPSC బోర్డును రద్దు చేసి పరీక్షలు పెట్టాలని డిమాండ్ చేశారు. సిట్ అధికారులు అసలు దొంగలను పట్టుకోవాలని కోరారు. నిందితులు వేరు.. సాక్షులు వేరు. ఛైర్మన్, కార్యదర్శి, సభ్యులను సాక్షులుగా పిలిచి అడుగుతున్నారు. కాన్ఫిడెన్షియల్ విషయాలు కేటీఆర్కు ఎలా తెలుస్తున్నాయి? సిట్ అధికారులు చెబుతున్నారా? అనే అనుమానం వ్యక్తం చేశారు.
పేపర్ లీకుకు పేపర్ అవుట్కు తేడా ఉందని రేవంత్ అన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయిందన్నారు. కానీ ఎస్ఎస్సీ పేపరు అవుటయిందని చెప్పారు. బండి సంజయ్ కుట్ర నిజమైతే బెయిల్ పై ప్రభుత్వం కోర్టును ఎందుకు ఆశ్రయించలేదని ప్రశ్నించారు. బీజేపీ, కేసీఆర్ ఒప్పందంలో భాగంగానే ఈ డ్రామా జరిగిందని మండిపడ్డారు.