Half Day Office : ఒకపూటే విధులు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు ఈ బంఫర్ ఆఫర్ ఇచ్చింది. ప్రస్తుతం అక్కడ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. మే 2 నుంచి ఉదయం 7.30 గంటలకు డ్యూటీకి రావాలి. మధ్యాహ్నం 2 గంటలకు విధులు ముగిసిపోతాయి. జూలై 15 వరకు కొత్త పనివేళలు అమలవుతాయి. వేసవిలో ఇలా ఉద్యోగులకు తీపికబురు చెప్పింది పంజాబ్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ వీడియో సందేశం ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు నిపుణులతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
సాధారణంగా వేసవిలో పిల్లలకు ఎండల నుంచి ఉపశమనం కల్పించేందుకు ఒంటిపూట బడులు నిర్వహిస్తుంటారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇలాంటి అవకాశం కల్పించింది పంజాబ్ ప్రభుత్వం . ఆఫీసుల పనివేళలను మార్చడంతో విద్యుత్ లోడ్ కూడా తగ్గుతుందని సీఎం చెప్పారు. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత విద్యుత్పై లోడ్ అధికంగా ఉంటుందని విద్యుత్శాఖ అధికారులు తెలిపారని.. ఇప్పుడు ఆఫీసులను 2 గంటలకు మూసివేయడంతో ఆ లోడ్ 300-350 మెగావాట్లు తగ్గుతుందన్నారు. తాను కూడా ఉదయం 7.30 గంటలకే ఆఫీసుకు వస్తానని ప్రకటించారు.
కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ ఏడాది వేసవిలో అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని ఇప్పటికే భారత వాతావరణశాఖ ప్రకటించింది. బిహార్, ఝార్ఖండ్, ఉత్తర్ప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఏప్రిల్- జూన్ మధ్య ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయని హెచ్చరించింది. వేడిగాలులు వీస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగులు ఖుషీ అవుతున్నారు. సమ్మర్ హాలీడేస్ ఇంట్లో ఉండే పిల్లలతో ఎక్కువసేపు గడిపే అవకాశం దొరుకుతుందని సంతోష పడుతున్నారు.