Avanthi Srinivas : విశాఖ జిల్లా భీమిలి వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పార్టీ మారతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయన మళ్లీ సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారని వార్తలు వచ్చాయి. తిరిగి టీడీపీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని చర్చ నడుస్తోంది. అనకాపల్లి నుంచి పోటీకి దిగుతారని టాక్ వచ్చింది. ఈ వార్తలపై అవంతి స్పందించారు. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు.
తాను టీడీపీలో చేరతానని దుష్ప్రచారం చేస్తున్నారని అవంతి మండిపడ్డారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు వైసీపీలో ఉంటానని తేల్చేశారు. మధురవాడలో జరిగిన ఆసరా, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న అవంతి.. పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. ప్రతిపక్ష నాయకులు మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. అందుకే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాజయం తప్పదన్నారు. వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని స్పష్టం చేశారు.
ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన అవంతి.. 2009 ఎన్నికల్లో భీమిలి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రజారాజ్యం పార్టీ విలీనం తర్వాత కాంగ్రెస్ లో కొంతకాలం కొనసాగారు. 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎంపీగా గెలిచారు. అయితే 2019 ఎన్నికలకు ముందు అవంతి మరో జంప్ చేశారు. ఈసారి వైసీపీ కండువా కప్పుకున్నారు. తొలిసారి తాను ఎమ్మెల్యేగా గెలిచిన స్థానం నుంచే మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సీఎం జగన్ కేబినెట్ లో స్థానం కూడా దక్కించుకున్నారు.
పర్యాటక శాఖ మంత్రి పనిచేసిన అవంతికి ..జగన్ కేబినెట్ 2.0లో స్థానం దక్కలేదు. అప్పటి నుంచి కాస్త సైలెంట్ అయిపోయారు. ఈసారి వైసీపీలో 60 మంది సిట్టింగులకు స్థానం దక్కదనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో అది దుష్ప్రచారంగా సీఎం జగన్ కొట్టిపారేశారు. కానీ చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో అనుమానాలు ఉన్నాయి. అలాంటి వారితో టీడీపీ టచ్ లో ఉందనే ప్రచారం సాగుతోంది. చంద్రబాబు సహా టీడీపీ నేతలు బహిరంగంగానే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నారు. మరి అవంతికి వైసీపీ టిక్కెట్ దక్కుతుందా..? దక్కకపోయినా జగన్ వెంటే నడుస్తారా..? టీడీపీ ఆహ్వానించినా సైకిల్ ఎక్కరా..? లేదా గతంలో మాదిరిగానే ఎన్నికలకు ముందు జంప్ చేస్తారా..?