PM Modi Tour: మోదీ హైదరాబాద్ వస్తున్నారు. ప్రధాని పర్యటనను అడ్డుకుంటామని కాంగ్రెస్ హెచ్చరించింది. నల్ల బెలూన్లతో నిరసన చెప్పేందుకు సిద్ధమవుతోంది యూత్ కాంగ్రెస్. పోలీసులు ఉలిక్కపడ్డారు. ముందుజాగ్రత్త చర్యగా.. పలువురు కాంగ్రెస్ లీడర్లను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు.
యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి, NSUI అధ్యక్షులు బలమూరి వెంకట్, దళిత కాంగ్రెస్ అధ్యక్షులు ప్రీతమ్, మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు తదితరులను ముందస్తు అరెస్ట్ చేశారు. వారిని సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు. అరెస్టులపై కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. ఇదేమీ పోలీస్ రాజ్యం అంటూ తప్పుబడుతోంది.
అయితే, బీఆర్ఎస్ ఆందోళనలకు మాత్రం ఎలాంటి అడ్డంకులు లేకపోవడం ఆసక్తికరం. సింగరేణి కాలరీస్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు పిలుపుఇచ్చింది బీఆర్ఎస్. ఇప్పటికే మోదీ టార్గెట్గా హోర్డింగ్స్, ఫ్లెక్సీలతో సెగ తగిలింది. సింగరేణి ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో కార్మికులు ధర్నాలు, ఆందోళనలకు దిగుతున్నారు. మోదీ, బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. వామపక్షాలు సైతం గులాబీ శ్రేణులకు జత కలవడంతో.. ప్రధానికి వ్యతిరేకంగా తెలంగాణ వ్యాప్తంగా నిరసన హోరెత్తుతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ తీరుపై బీజేపీ మండిపడుతోంది.