COVID: కొవిడ్ ఓ ఆటాడుకుంటోంది. గ్యాప్ ఇచ్చి మరీ దాడి చేస్తోంది. రెండేళ్లుగా కాస్త కంట్రోల్లో ఉన్న కరోనా వైరస్.. లేటెస్ట్గా మళ్లీ విజృంభిస్తోంది. కొన్నివారాలుగా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. వేరియంట్లు మార్చుకుంటూ.. మభ్యపెట్టి మరీ పంజా విసురుతోంది. అనేక రాష్ట్రాల్లో భారీగా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. రోజువారీ కేసుల సంఖ్య 6 వేలు దాటింది. ప్రస్తుతం 28,303 క్రియాశీల కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 3.39 శాతానికి చేరింది. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, యూపీ, ఢిల్లీ, తెలంగాణలో కేసుల సంఖ్య పెరుగుతోంది. కొవిడ్ కల్లోలాన్ని గుర్తించిన కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ.. ఆయా రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులు, ఉన్నతస్థాయి అధికారులతో వర్చువల్గా సమావేశం నిర్వహించారు. కొవిడ్ నిర్వహణ సంసిద్ధతను తెలుసుకొనేందుకు ఏప్రిల్ 10, 12 తేదీల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశించారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్, వ్యాక్సినేషన్, అప్రాప్రియేట్ బిహేవియర్ వంటి 5 అంచెల వ్యూహాన్ని పక్కాగా అమలు చేయాలని చెప్పారు. ఎమర్జెన్సీ హాట్స్పాట్లను గుర్తించాలని సూచించారు. కొవిడ్ టెస్టుల సంఖ్యను పెంచడం, జీనోమ్ సీక్వెన్సింగ్ను పెంచడంతో పాటు అవసరమైన వారందరికీ వ్యాక్సిన్లు అందజేయాలని కోరింది కేంద్రం.
అయితే, వ్యాక్సిన్లు వేయాలంటూ చెప్పిన కేంద్రమే.. వాటి సరఫరాపై చేతులెత్తేయడం విమర్శల పాలవుతోంది. తమకు వ్యాక్సిన్లు సరఫరా చేయాలని కోరిన పలు రాష్ట్రాల మంత్రులకు.. వ్యా క్సిన్ సరఫరా చేసేది లేదని, రాష్ట్రాలే సొంతంగా కొనుగోలు చేసుకోవాలని సూచించింది.
కేంద్రమంత్రి మాండవీయతో జరిగిన సమావేశంలో.. తెలంగాణకి అవసరమైన వ్యాక్సిన్ డోసులను తక్షణం సరఫరా చేయాలని మంత్రి హరీష్ రావు కోరారు. ఈ విషయంలో ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసినట్టు గుర్తు చేశారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలు సైతం తమకు వ్యాక్సిన్ సరఫరా నిలిచిపోయిందని, వ్యాక్సినేషన్ కార్యక్రమానికి అంతరాయం కలుగుతున్నట్టు కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాండవీయ మాట్లాడుతూ.. కావాల్సిన వ్యాక్సిన్లు ఆయా రాష్ట్రాలు కొనుగోలు చేసుకోవచ్చని, బహిరంగా మార్కెట్లో పుష్కలంగా వ్యాక్సిన్ నిల్వలు ఉన్నాయని చెప్పడంపై పలు రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.