Smart Glasses:- టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందడం వల్లే ఎన్నో రకాలుగా ఆరోగ్య సమస్యలు ఉన్న వ్యక్తులు కూడా వాటి నుండి బయటపడగలుగుతున్నారు. దివ్యాంగులకు కూడా టెక్నాలజీ ఎంతో సాయంగా నిలుస్తోంది. కళ్లు కనిపించనివారికి, చెవుల వినికిడి లోపం ఉన్నవారికి టెక్నాలజీ అన్ని విధాలుగా అండగా ఉంటోంది. తాజాగా శాస్త్రవేత్తలు కంటిచూపు లోపం ఉన్నవారి కోసం మరో కొత్త పరికరాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు.
కేవలం ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు మాత్రమే కాదు.. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారు కూడా వారి వ్యాపారాన్ని పెంచుకోవడం కోసం కొత్త కొత్త ఆలోచనలతో ముందుకొస్తున్నారు. తాజాగా ఢిల్లీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి.. కంటిచూపు సరిగా లేనివారికి, అంధులకు ఉపయోగపడే విధంగా స్మార్ట్ విజన్ కళ్లద్దాలను తయారు చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ), మిషిన్ లెర్నింగ్ టెక్నాలజీతో ఈ స్మార్ట్ విజన్ గ్లాసెస్ తయారు చేయబడ్డాయి.
ఈ స్మార్ట్ విజన్ గ్లాసులు చాలా తేలికగా ఉంటాయి. ఇందులో కెమెరా, సెన్సార్తో పాటు మరెన్నో కొత్త కొత్త టెక్నాలజీలు కూడా ఉన్నాయి. ఇవి యూజర్లకు నిరంతరం సాయం చేస్తూ ఉంటాయి. ఇది ఎన్నో విధాలుగా వారికి సూచనలు అందిస్తూ ఉంటుంది. మొహాలను గుర్తుపట్టడం, నడుస్తున్నప్పుడు సూచనలు ఇవ్వడం లాంటివి ఈ స్మార్ట్ విజన్ గ్లాసెస్ చేస్తూ ఉంటాయి. అంతే కాకుండా వీటిలో ఒక స్మార్ట్ ఇయర్ పీస్ కూడా వస్తుంది. ఇది సమాచారాన్ని విని, అర్థం చేసుకొని యూజర్లకు చెప్తుంది.
వాయిస్ అసిస్టెంట్, జీపీఎస్ నేవిగేషన్ లాంటి ఫీచర్స్ కూడా ఈ స్మార్ట్ విజన్ గ్లాసెస్లో ఉన్నాయి. కంటిచూపు లేని వారికి జీపీఎస్ నేవిగేషన్ ఎంతో అవసరం కాబట్టి ఈ ఫీచర్ను అందులో యాడ్ చేశామని వైద్యులు తెలిపారు. తాజాగా ఈ స్మార్ట్ విజన్ గ్లాసెస్ను గ్రాండ్గా లాంచ్ చేశారు. ఇది కంటిచూపు లేని వారిని కూడా బయట ప్రపంచంతో కలిసేలా చేస్తుందని లాంచ్ కార్యక్రమంలో వైద్యులు చెప్పారు. టెక్నాలజీ అనేది కంటిచూపు లేని వారి జీవితాన్ని ఎన్నో విధాలుగా మారుస్తుందని వారు సంతోషం వ్యక్తం చేశారు.