CBN Selfie: ఏపీ పాలిటిక్స్లో సెల్ఫీల ట్రెండ్ నడుస్తోంది. నారా లోకేశ్ స్టార్ట్ చేశారు. చంద్రబాబు కంటిన్యూ చేస్తున్నారు. టీడీపీ హయాంలో ఏపీకి వచ్చిన పరిశ్రమలు, కంపెనీల ముందు నిలబడి సెల్ఫీలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు తమ్ముళ్లు. వైసీపీ హయాంలో వచ్చిన సంస్థలేవి? ఎన్ని? అంటూ అధికార పార్టీకి సవాల్ విసురుతున్నారు. సెల్ఫీ ఛాలెంజ్ బాగానే వర్కవుట్ అయినట్టుంది. వైసీపీ సైలెంట్ అయిపోయింది.
ఈలోగా ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. అనూహ్యంగా నాలుగు సీట్లు గెలుచుకుంది టీడీపీ. జగన్కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం మనదేనంటూ టీడీపీ శ్రేణులు విజయగర్వంతో ఉన్నాయి. ఆ జోష్ను మరింత ముందుకు తీసుకెళ్లేలా.. వైసీపీని మరింత కార్నర్ చేసేలా.. పార్టీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగారు. ఆయనసైతం సెల్ఫీ ఛాలెంజ్ స్టార్ట్ చేశారు.
నేరుగా సీఎం జగన్కే సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు ప్రతిపక్ష నేత చంద్రబాబు. నెల్లూరులో టీడీపీ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్ల ముందు చంద్రబాబు సెల్ఫీ దిగారు. ఆ ఫోటోలను సీఎం జగన్కు ట్యాగ్ చేశారు.
“చూడు… @ysjagan! ఇవే మా ప్రభుత్వ హయాంలో పేదలకు ఒక్క నెల్లూరులోనే కట్టిన వేలాది టిడ్కో ఇళ్ళు. రాష్ట్రంలో నాడు నిర్మించిన లక్షల టిడ్కో ఇళ్లకు సజీవ సాక్ష్యాలు! ఈ నాలుగేళ్లలో నువ్వు కట్టిన ఇళ్లెన్ని? నువ్వు చెప్పిన ఇళ్లెక్కడ? జవాబు చెప్పగలవా?” అంటూ సెల్ఫీతో జగన్ను ఛాలెంజ్ చేశారు సీబీఎన్. #SelfieChallengeToJagan అంటూ హ్యాష్ట్యాగ్ జత చేశారు.
చంద్రబాబు నెల్లూరు పర్యటనపై అంతే ఘాటుగా స్పందించారు మంత్రి కాకాని. టిడ్కో ఇళ్లు తప్ప నెల్లూరుకు చంద్రబాబు ఏం చేసారో చెప్పాలని నిలదీసారు. టీడీపీ ప్రభుత్వం నెల్లూరు జిల్లాకు చేసింది శూన్యమన్నారు. వైసీపీ వచ్చాకే జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి అయ్యాయన్నారు. రైతాంగానికి సాగు నీరు అందిస్తున్నామన్నారు. టీడీపీ హయాంలోనే నీళ్లు లేక కరువు మండలాలుగా ప్రకటించారని కాకాని ఫైర్ అయ్యారు.
ఎన్నికలకు ఇంకో ఏడాది టైం మాత్రమే ఉండడంతో.. ఏపీ పాలిటిక్స్ హీట్ పుట్టిస్తున్నాయి. వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలు అవుతుందని టీడీపీ విమర్శిస్తుంటే.. తమ్ముళ్ల ఆరోపణలను కౌంటర్ ఎటాక్ చేస్తోంది వైసీపీ.