posani: గ్యాప్ వచ్చిందో లేదంటే గ్యాప్ తీసుకున్నారో తెలీదు కానీ.. పోసాని కృష్ణమురళి మరోసారి రెచ్చిపోయారు. గతంలో చేసిన కామెంట్లే.. మళ్లీ చేసి రచ్చ రాజేశారు. అవి నంది అవార్డులు కాదు.. కమ్మ అవార్డులు అంటూ కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారు.
అవార్డులు అనేవి కులం, మతం చూసి ఇవ్వకూడదని.. నంది అవార్డులు అలాగే ఇచ్చేవారని పోసాని అన్నారు. నేరుగా చంద్రబాబు నాయుడినే టార్గెట్ చేశారు. ఆయన హయాంలో గ్రూపులు, కులాల వారీగా అవార్డులు పంచుకునేవారని ఆరోపించారు.
‘టెంపర్’ మూవీలో నటనకుగాను.. తప్పక ఇవ్వాల్సిన పరిస్థితుల్లో వేరే ఆప్షన్ లేక తనకు నంది అవార్డు ఇచ్చారని గుర్తు చేశారు. తాను కూడా వెళ్లి ఆ అవార్డు తీసుకున్నానని.. అయితే ఎవరెవరికి ఏయే అవార్డులు ఇచ్చారో చూశాక అసలు విషయం అర్థమైందని చెప్పారు. అప్పుడు అవార్డుల కమిటీలో 11మంది కమ్మ కులం వారే ఉన్నారని.. అవార్డులు ఇచ్చిన తీరు తనకు నచ్చలేదన్నారు. అందుకే, తనకొచ్చిన నంది అవార్డును తిరస్కరించానని చెప్పుకొచ్చారు పోసాని. తెలుగు ఇండస్ట్రీని కులాలు, మతాలు కాదు శాసించేది.. డబ్బు ఒక్కటే అంటూ మరో విమర్శ కూడా చేశారు.
తాను గాయం, పవిత్ర బంధం, శివయ్య లాంటి ఎన్నో మంచి సినిమాలకు కథ రాశానని.. కానీ అప్పుడు తనకు నంది అవార్డు రాలేదని పోసాని పెదవి విరిచారు. ఏపీ ఫైబర్నెట్ ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పోసాని కృష్ణమురళి తన వ్యాఖ్యలతో కలకలం రేపారు.