Paper Leak: పాపం ఆ పిల్లాడు. చేయని తప్పుకు ఐదేళ్లు డిబార్ అయ్యాడు. ఇదేం న్యాయం సారు అంటూ డీఈవోను వేడుకుంటే.. అది అంతేపో అన్నాడు. పరీక్షలు రాయనీయకపోవడంతో ఆ విద్యార్థి ఏడుస్తున్నాడు. తల్లితో కలిసొచ్చి మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే…
టెన్త్ హిందీ పేపర్ లీకేజీ ఘటన తెలంగాణలో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసుగా. ఏకంగా బండి సంజయే అరెస్ట్ అయ్యేంతలా. ఏ3 నిందితుడు.. పరీక్ష రాస్తున్న విద్యార్థి నుంచి బలవంతంగా పేపర్ లాక్కొని.. దాన్ని సెల్ఫోన్లో ఫోటోలు తీసి వైరల్ చేశాడు. ఆ తర్వాత రచ్చ తెలిసిందే. ఆ నిందితుడు ఎవరి నుంచైతే పేపర్ లాక్కున్నాడో.. ఆ విద్యార్థిని ఐదేళ్లు డిబార్ చేశారు అధికారులు. అతని పేపరే బయటకు వచ్చింది కాబట్టి.. అతని మూలంగానే ముగ్గురు ఉద్యోగులు సస్పెండ్ అయ్యారు కాబట్టి.. నిన్ను డిబార్ చేస్తున్నాం పో అంటూ డీఈవో హుకూం జారీ చేశాడు. పదో తరగతి పరీక్షలు రాయకుండా ఆ స్టూడెంట్ను అధికారులు అడ్డుకున్నారు.
ఈ ఘటనలో తాను ఏ తప్పూ చేయలేదని, ఐదేళ్ల పాటు డిబార్ చేయడం అన్యాయమని బాధిత విద్యార్థి బోరున విలపించాడు. హాల్టికెట్ తీసుకొని ఓ పత్రంపై సంతకం చేయించుకున్నారని చెబుతున్నాడు. తాన మానాన తాను ఎగ్జామ్ రాస్తుంటే.. గోడ మీది నుంచి వచ్చిన ఒకడు.. తనను చంపుతానని బెదిరించి ప్రశ్నాపత్రం లాక్కున్నాడని.. ఇందులో తన ప్రమేయం ఏమీ లేదంటూ ఆ పిల్లాడు మొత్తుకుంటున్నాడు. తనకు న్యాయం చేయాలంటూ తల్లితో కలిసి.. పరీక్ష హాల్కు వచ్చిన అధికారులందరినీ వేడుకుంటున్నాడు.
ఈ అధికారులున్నారే.. పేపర్ లీక్ కాకుండా అడ్డుకోలేరు.. బయటి వ్యక్తి గోడెక్కి గదిలో ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థి నుంచి పేపర్ లాక్కుంటే ఆపలేకపోయారు.. అమాయకుడైన ఆ పిల్లాడిని మాత్రం ఐదేళ్లు డిబార్ చేసి తమ అధికార బలాన్ని చాటుకున్నారు. ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా? ఆ విద్యార్థికి జరిగిన నష్టాన్ని తీర్చేదెవరు? పోయిన ఎగ్జామ్ మళ్లీ తిరిగి వస్తుందా? ఆ స్టూడెంట్ భవిష్యత్తు ఏంకాను? ఈ బాధలో అతనేమైనా చేసుకుంటే..? అందుకు బాధ్యులు ఎవరు? అధికారులారా.. మీ తీరు సిగ్గు సిగ్గు.