Chota News: తొమ్మిదేళ్ల కాలంలో తెలంగాణకు ప్రధాని మోదీ ఏం చేశారన్న దానిపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క 30 ప్రశ్నలు సంధిస్తూ లేఖ రాశారు. తాను అడిగిన 30 ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని లేఖలో డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయంలోనే తెలంగాణ అభివృద్ధి జరిగింది తప్ప మోదీ హయాంలో మరే అభివృద్ధి జరగలేదని దుయ్యబట్టారు.
TSPSC, టెన్త్ పేపర్ లీక్ కేసులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కేటీఆర్ బాధ్యతగా రాజీనామా చేయాలని కోరారు. హిందీ పేపర్ వాట్సప్ లో ఎవరో షేర్ చేస్తే తనకేం సంబంధముంటుందని సంజయ్ నిలదీశారు. టెన్త్ పరీక్షాకేంద్రంలోకి మొబైల్ ఎలా వెళ్లిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్కుమార్రెడ్డి బీజేపీలో చేరారు. ఢిల్లీలో పార్టీ నేతల సమక్షంలో బీజేపీలో చేరారు. కిరణ్కుమారెడ్డికి కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు.
ప్రధాని మోదీ రేపు హైదరాబాద్లో పర్యటించనున్నారు. ఉదయం 11.45 కు సికింద్రాబాద్, తిరుపతి వందేభారత్ రైలును ప్రారంభించనున్నారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల అనంతరం పరేడ్ గ్రౌండ్లో బహిరంగ సభలో పాల్గొంటారు.
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో విజయ్ చౌక్ దగ్గర వాకథాన్ నిర్వహించారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవియా, సహాయమంత్రి భారతి ప్రవీణ్ పవార్ పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యం విషయంలో వైద్యులు తమ పాత్ర నిరంతరం కొనసాగించాలని కేంద్రమంత్రి కోరారు.
జైలు నుంచి విడుదలైన కాంగ్రెస్ నేత నవ్జ్యోత్ సింగ్ సిద్ధూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్తో కలిసి ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఫొటోలోను సిద్ధూ తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు.
ఢిల్లీ మాజీ మంత్రి మనీష్ సిసోడియా ప్రధాని మోదీకి లేఖ రాశారు. ప్రధాని మోదీ తన విద్యార్హతలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. హిందీ భాషలో రాసిన లేఖను సిసోడియా విడుదల చేశారు. దేశ ప్రగతి కోసం ఓ విద్యావంతుడైన వ్యక్తి ప్రధాని కావాలని సిసోడియా తన లేఖలో తెలిపారు.
ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో సింగరేణి ప్రాంతాల్లో మహా ధర్నాలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. సింగరేణి ప్రైవేటీకరణను నిరసిస్తూ మంచిర్యాల, భూపాలపల్లి, కొత్తగూడెం, రామగుండంలో నిరసనలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.
దేశంలో కోవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా 6వేల 50 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఈ కేసులతో కలుపుకోని దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 28వేల 303కి చేరింది.
హైదరాబాద్ బోరబండలో గుడ్ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ చర్చ్లో వేడుకుల ఏర్పాటు చేశారు. క్రిస్టియన్ సోదరులు ఏసుక్రీస్తు వేషధారణతో బస్తీల్లో పర్యటించారు.
నిర్మల్ జిల్లా భైంసా సమీపంలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ ఢీకొట్టడంతో నుజ్జునుజ్జయింది. ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, ఎనిమిది మందికి గాయాలయ్యాయి. బాధితులంతా భైంసా వాసులుగా పోలీసులు గుర్తించారు.
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వరుసగా శుక్ర, శని, ఆదివారాలు సెలవు రోజులు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. దీంతో సర్వదర్శనం క్యూలైన్ గోగర్భం జలాశయం వరకు చేరుకున్నది. శ్రీవారి దర్శనానికి 30 కంపార్టుమెంటుల్లో భక్తులు వేచి ఉన్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినాపురంలోని పేరంటాలమ్మ ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు హుండీ ధ్వంసం చేసి నగదు ఎత్తుకెళ్లారు. గతంలోనూ మూడుసార్లు హుండీ ఎత్తుకెళ్లినట్లు స్థానికులు ఆరోపించారు. వరుస దొంగతనాలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తిరుపతి జిల్లా ఏరూరు సముద్ర తీరంలో ఏసుక్రీస్తు సిలువను ప్రముఖ సాండ్ ఆర్టిస్ట్ సనత్కుమార్ రూపొందించారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా ఇసుకపై రూపొందించిన సైకత శిల్పం ఆకట్టుకుంటోంది. ప్రజలకు గుడ్ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తూ శిల్పం రూపొందించారు.
నాగర్కర్నూల్ జిల్లా హౌసింగ్బోర్డులో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. హనుమాన్ దేవాలయం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర.. రామ్నగర్ కాలనీ, సంత బజార్, ఈదమ్మగుడి వరకు సాగింది. శోభాయాత్రలో యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఏలూరు జిల్లా పంగిడిగూడెంలో రైతులకు, కూలీలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన కూలీలకు 300 రూపాయలు ఇస్తూ.. స్థానికంగా ఉన్నవారికి 250 రూపాయలే ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న కూలీలను స్థానికులు అడ్డుకుని వాగ్వాదానికి దిగారు.
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఓజోన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో 5కే వాక్ నిర్వహించారు. కొత్తపేట నుంచి ఎల్బీనగర్ వరకు చేపట్టిన వాక్ను ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ జెండా ఊపి ప్రారంభించారు.
ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం ఖైరిగూడ ఓపెన్ కాస్ట్ గని వద్ద భూ నిర్వాసితులు ఆందోళన చేశారు. నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వకుండా యూపీ, బీహార్ వారికి పనులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి లేక ఇబ్బంది పడుతుంటే ఇతర రాష్ట్రాల వారికి అవకాశాలకు ఇస్తున్నారని ఆరోపించారు.
సికింద్రాబాద్ బేగంపేటలో ఏసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నడుస్తున్న బస్సులో పొగలు రావడంతో డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును పక్కనే నిలిపేశారు. బస్సులో ప్రయాణికులు కూడా వెంటనే కిందికి దిగిపోవడంతో ఎవరికీ ప్రమాదం జరగలేదు.
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శ్రీవారి అభిషేక సేవలో ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా పాల్గొన్నారు. సీజేతో పాటు న్యాయమూర్తులు కృష్ణమోహన్, గోపాలకృష్ణ స్వామివారిని దర్శించుకున్నారు.