Hanuman Shobha Yatra: తెలంగాణవ్యాప్తంగా హనుమాన్ శోభాయాత్రలు అట్టహాసంగా సాగాయి. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు కాషాయమయంగా మారాయి. హనుమాన్ జయంతి సందర్భంగా.. వీధులన్నీ జై శ్రీరాం జై హనుమాన్ నినాదాలతో మార్మోగాయి.
హైదరాబాద్లో గౌలిగూడ నుంచి ప్రారంభమైన హనుమాన్ శోభాయాత్ర… తాడ్బన్ దగ్గర ముగుస్తుంది. వర్షం వల్ల కొద్దిసేపు యాత్రకి అంతరాయం కలిగింది. యాత్ర కొనసాగే మార్గాల్లో పదిహేను వేల మంది పోలీసులతో భద్రత కల్పించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ శోభాయాత్రకు హాజరుకాకుండా ముందస్తు అరెస్ట్ చేయడం కలకలం రేపింది.
గౌలిగుడా హనుమాన్ శోభాయాత్రలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. తొలుత ఆలయంలో ఆంజనేయుడిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్యకర్తలతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. చేతిలో విల్లు, బాణం, గద ధరించి అక్కడున్న ప్రజల్లో ఉత్సాహం నింపారు.
హనుమాన్ జయంతిని పురస్కరించుకొని తాడ్బండ్ హనుమాన్ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబుచేశారు. పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హనుమాన్ చాలీసా పారాయణాలతో ఆలయం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
ఎల్బీనగర్లోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో అట్టహాసంగా హనుమాన్ శోభాయాత్ర కొనసాగుతోంది. ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేసి శోభాయాత్ర ప్రారంభించారు. అధిక సంఖ్యలో భక్తులు శోభాయాత్రలో పాల్గొనడంతో… వీధులన్నీ భక్తులతో కళకళలాడుతున్నాయి.
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోనూ హనుమాన్ శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. కాషాయ జెండాలతో రహదారులు రద్దీగా మారాయి. చందానగర్ డివిజన్ హనుమాన్ శోభాయాత్రలో భిన్నత్వంలో ఏకత్వం కనిపించింది. చందానగర్ పరిధిలోని ముస్లింలు… రహదారిపై హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్న యువకులకు మజ్జిగ అందించారు.
కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ సహా మిగతా జిల్లాల్లోనూ హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్రలు నిర్వహించారు. యాత్రలో పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలతో ఆనందాన్ని వ్యక్తం చేశారు.