BRS: ఇక్కడ టెన్త్ పేపర్ లీకేజీ కేసు బీజేపీ నేతల మెడకు చుట్టుకుంటుంది. సరిగ్గా ఇదే సమయంలో ఢిల్లీ తీహార్ జైలు నుంచి సుఖేశ్ చంద్రశేఖర్ రాసిన మరో లేఖ బీఆర్ఎస్ నేతను టార్గెట్ చేస్తోంది. కాకతాళీయమో.. కావాలనో.. తెలీదు కానీ ఈ రెండు పరిణామాలు వెంటవెంటనే జరగడం మాత్రం అనుమానాస్పదం.
జైల్లో ఉన్న సుఖేశ్ మరోసారి లెటర్ బాంబ్ పేల్చారు. సీఎం కేజ్రీవాల్, మంత్రి సత్యేంద్ర జైన్ సూచనతో బీఆర్ఎస్ ఆఫీసులో 15 కోట్లు ఇచ్చానని లేఖలో తెలిపాడు. ఆ డబ్బును.. ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న బ్లాక్ కాలర్, 6060 నెంబర్ ఉన్న రేంజ్ రోవర్ కారులో ఉన్న ఏపీ అనే వ్యక్తికి ఇచ్చానని గత లేఖలో చెప్పాడు. ఆ ఏపీ అంటే అరుణ్ పెళ్లై అని ఈసారి కన్ఫామ్ చేశాడు సుఖేశ్.
కేజ్రీవాల్ ఇచ్చే డబ్బులు తన సహాయకుడికి ఇవ్వాలంటూ ఆ బీఆర్ఎస్ నేత చెప్పారని.. ఇప్పుడా నేత విచారణ ఎదుర్కొంటున్నారని అన్నారు. తానిచ్చిన డబ్బులు ముట్టినట్టు కూడా కన్ఫామ్ మెసేజ్ వచ్చిందని.. ఆ చాట్ అంతా తన దగ్గర ఉందని వెల్లడించాడు. తాను మాట్లాడే ప్రతీ మాటకు సాక్షం ఉందని.. అవసరమైతే నార్కో పాలిగ్రాఫ్ టెస్టుకు సైతం తాను సిద్ధమని లేఖలో స్పష్టం చేశాడు సుఖేశ్.
సుఖేశ్ చంద్రశేఖర్ చేసిన ఆరోపణలు ఎమ్మెల్సీ కవిత గురించే అంటున్నారు. ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత ఆమె ఒక్కరే. అరుణ్ పిళ్లై సైతం కవిత సహాయకుడే. ఆ లెక్కన సుఖేశ్ చేస్తున్న ఆరోపణలు కవితనే టార్గెట్ చేస్తున్నాయి. దీంతో, ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు మరిన్ని చిక్కులు తప్పకపోవచ్చు.
సుఖేశ్తో బీజేపీనే మాట్లాడిస్తోందని ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. టెన్త్ పేపర్ లీక్ ఘటనలో బండి సంజయ్ను అరెస్ట్ చేసినందుకు కౌంటర్గానే ఢిల్లీలో సుఖేశ్తో కవితను కార్నర్ చేసేలా లేఖ రాయించారా? అని అనుమానిస్తున్నారు గులాబీ నేతలు. టాపిక్ను ఇటు నుంచి అటు డైవర్ట్ చేసే ఎత్తుగడేనని అంటున్నారు.