Saleswaram: నల్లమల అడవుల్లో సలేశ్వరం జాతర. అన్నీలోయలు, రాళ్లు, కొండలు, కోనలే. దట్టమైన అడవి మధ్యగా సాగుతుంది యాత్ర. లక్షల్లో భక్తులు తరలివస్తారు. ఇరుకైన మార్గంలో ఓపిగ్గా, జాగ్రత్తగా ముందుకు కదులుతుంటారు. వారం రోజుల జాతరను ఈసారి మూడు రోజులకే కుదించారు. దీంతో తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. యాత్రా మార్గం భక్తులతో కిక్కిరిసిపోయింది. తీవ్ర తోపులాట జరిగింది. ఆ తోపులాటలో ఊపిరాడక ముగ్గురు భక్తులు మృత్యువాత పడటం విషాదం నింపింది.
ఏర్పాట్లు చేయడంలో అధికార యంత్రాంగం విఫలమైందనే విమర్శ వినిపిస్తోంది. గతంతో పోలిస్తే భక్తుల రద్దీ భారీగా పెరిగిందని పోలీసు అధికారులు చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశామని, ఎక్కడికక్కడ బేస్ క్యాంపుల దగ్గర అంబులెన్స్ సదుపాయం కూడా కల్పించామని తెలిపారు. అయినా, సలేశ్వరం యాత్ర మార్గంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్స్తో భక్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.