Jagan: నాలుగు ఎమ్మెల్సీ సీట్లు కోల్పాయక సీఎం జగన్ వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఇటీవలి ఎమ్మెల్యేలు, రీజనల్ కోఆర్డినేటర్ల మీటింగ్లో జగన్ వాయిస్ మారిపోయింది. అందరూ తనకు కావాలని.. ఎవరినీ తీసేయనంటూ.. మనమంతా ఒక్కటేనంటూ మంచిమాటలు చెప్పారు. ఎమ్మెల్సీ ఫలితాలను పట్టించుకోవద్దన్నారు. అదంతా పార్టీ వ్యవహారం. ఇక ప్రతిపక్షాలపైనా మరింత ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. లేటెస్ట్గా పల్నాడులో జరిగిన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ప్రారంభోత్సవంలోనూ విపక్షంపై పదునైన విమర్శలు చేశారు.
“నవరత్నాలతో మీ బిడ్డ వస్తుంటే తోడేళ్లంతా ఒక్కటవుతున్నారు.. మీ బిడ్డను ఎదుర్కొలేక ఎత్తులు, జిత్తులు, పొత్తులు, కుయుక్తులు పన్నుతున్నారు”.. అంటూ తీవ్ర స్వరంతో మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు దోచుకో, తినుకో, పంచుకో.. అన్నట్టు వ్యవహరించారని.. వయసు పెరిగినా బుద్ధి పెరగని క్రిమినల్ లంచావతారులని.. చంద్రబాబే టార్గెట్గా విరుచుకుపడ్డారు సీఎం జగన్. స్కాములు తప్ప, స్కీములు తెలియని బాబులని.. సామాజిక న్యాయం తెలియన పరాన్న జీవులంటూ టీడీపీకి పంచ్లు వేశారు.
తాను ఏదైతే చెప్తానో అదే చేస్తానని.. వచ్చే ఎన్నికల్లో ఎలాంటి పొత్తులు ఉండవని.. తనకు ప్రజలతోనే పొత్తు అని జగన్ అన్నారు. మీ ఇంట్లో మంచి జరిగితే నాకు తోడుగా ఉండండి.. అంటూ ప్రజలకు పిలుపు ఇచ్చారు. లంచాలు, వివక్ష లేకుండా పాలన చేస్తున్నామని చెప్పారు.
పల్నాడు జిల్లా లింగంగుంట్ల నుంచి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను ప్రారంభించారు సీఎం జగన్. ఈ కాన్సెప్ట్ దేశ చరిత్రలోనే రోల్ మోడల్గా నిలుస్తుందని ఆకాంక్షించారు. డాక్టర్ కోసం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని.. డాక్టరే ఇంటికి వచ్చి వైద్యం చేశాడని తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్తో వ్యాధులు ముదరకముందే గుర్తించవచ్చన్నారు.
ప్రతీ 2వేల జనాభాకు ఓ క్లినిక్.. మండలానికి రెండు పీహెచ్సీలు.. ప్రతీ పీహెచ్సీలు ఇద్దరు వైద్యులు ఉంటారని సీఎం జగన్ అన్నారు. వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లను పీహెచ్సీలతో అనుసంధానిస్తామని చెప్పారు. వైఎస్సార్ విలేజ్ క్లినిక్లో 14 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారని, 105 రకాల మందులు అందుబాటులో ఉంటాయని వివరించారు.