RevanthReddy: “బీజేపీతో కొట్లాడినట్టు నటించి కాంగ్రెస్ను మింగేస్తారు.. బీజేపీ ఇచ్చిన టాస్క్ను కేసీఆర్ అమలు చేస్తున్నారు.. తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల మధ్య ట్రయాంగిల్ లవ్ నడుస్తోంది”. ఇదీ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేసిన కామెంట్స్. వరుసగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. రేవంత్ వ్యాఖ్యలు నిజమేనా? అనిపిస్తున్నాయి. లేటెస్ట్గా బండి సంజయ్ అరెస్ట్ ఘటనతో మరోసారి రేవంత్ మాటలు చర్చనీయాంశమయ్యాయి.
రోజంతా నాన్స్టాప్ కవరేజ్. మీడియాలో బండి సంజయ్ తప్ప ఇంకెవరూ కనిపించలేదు. ఢిల్లీ వరకూ సంజయ్ పేరు మారుమోగిపోయింది. పార్లమెంట్లో బీజేపీ ఎంపీలు నిరసన తెలిపారు. స్పీకర్ను కలిసి ప్రివిలైజ్ నోటీస్ ఇచ్చారు. మోదీ, షా, నడ్డాలు.. బండి అరెస్ట్ గురించి చర్చించారు. ఓవరాల్గా బీజేపీకి హీరోగా మారారు బండి సంజయ్.
ఎవరో పేపర్ లీక్ చేశారు.. బండి సంజయ్ను అరెస్ట్ చేశారు. అంతా ఆయనే చేశారని సీపీ చెబుతున్నారు. నిజమో కాదో విచారణలో తేలుతుంది. కోర్టు బండికి 14 రోజుల రిమాండ్ వేసింది. ఖమ్మం జైలుకు సంజయ్ను షిఫ్ట్ చేశారు. టోటల్ ఎపిసోడ్లో బీజేపీకి ఫుల్ పబ్లిసిటీ.
ఇన్నాళ్లూ TSPSC పేపర్ లీక్ కేసులో పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి గట్టిగా పోరాడుతున్నారు. ఆయన చెప్పినట్టే మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి సొంతూరు మల్యాల మండలంతో 50 మంది వరకూ 100కి పైగా మార్కులు వచ్చాయి. మల్యాల వెళ్లి మరీ వారందరినీ ప్రశ్నించింది సిట్. ఇలా టీఎస్పీఎస్సీ కేసులో రేవంత్రెడ్డి పోరాటానికి ఫుల్గా పొలిటికల్ మైలేజ్ వచ్చింది. నిరుద్యోగులకు రేవంత్ హీరోగా కనిపించారు. ఆయనకు వచ్చిన ఇమేజ్ చూసి.. బీఆర్ఎస్ వెంటనే వ్యూహం మార్చేసిందని అంటున్నారు. రేవంత్రెడ్డికి పోటీగా బండి సంజయ్ను హీరోగా చూపించేలా.. టెన్త్ పేపర్ లీక్ కేసులో కావాలనే ఆయన్ను అరెస్ట్ చేసి.. పబ్లిక్ అటెన్షన్ను అటు డైవర్ట్ చేశారని అనుమానిస్తున్నారు. ఇదంతా బీఆర్ఎస్, బీజేపీ కలిసి ఆడుతున్న మైండ్ గేమ్ అని కాంగ్రెస్ నేతలు కస్సుమంటున్నారు.
పేపర్ లీక్ ద్వారా బీజేపీ, బీఆర్ఎస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయని సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క మండిపడ్డారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు రెండు పార్టీలు కలిసి నాటకం ఆడుతున్నాయని విమర్శించారు. బండి సంజయ్ను అర్ధరాత్రి అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. బీజేపీకి హైప్ క్రియేట్ చేసేందుకే ఇదంతా చేస్తున్నారనేది కాంగ్రెస్ ఆరోపణ. రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు సృష్టించి.. పోడు భూముల సమస్య, నిరుద్యోగుల సమస్య, ప్రశ్నాపత్రాల లీకేజీపై చర్చ జరగుకుండా చేస్తున్నాయనేది హస్తం పార్టీ విమర్శ.
కాంగ్రెస్ను సైడ్ చేసేందుకు.. తెలంగాణలో బీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నాయం అనేలా పొలిటికల్ డ్రామాకు తెరతీశారని అనుమానిస్తోంది కాంగ్రెస్. రేవంత్రెడ్డి అన్నట్టుగా.. ప్రచారంలో ముగ్గురుంటారు.. చివరికి మిగిలేది ఇద్దరే. ఆ ఇద్దరిలో ఒకరు కాంగ్రెస్సే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు హస్తం నేతలు.