Bandi Sanjay: ఈ నెల 8న తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణతో పాటు పలు రైల్వే, రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు ప్రధాని. పరేడ్ గ్రౌండ్స్ భారీ బహిరంగ సభతో బీజేపీ బలప్రదర్శనకు రెడీ అవుతోంది. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులు, జాతీయ, రాష్ట్రస్థాయి నేతలు తరలిరానున్నారు. భారీస్థాయిలో సభను విజయవంతం చేయడం ద్వారా పార్టీ కేడర్లో ఉత్సాహం నింపాలని భావిస్తున్న సమయంలో బండి సంజయ్ అరెస్ట్ అగ్గి రాజేసింది.
అదునుచూసి దెబ్బకొట్టారు కేసీఆర్. తెలంగాణ మీద దండయాత్రకు వస్తున్న మోదీకి.. బండి సంజయ్ అరెస్టుతో వార్నింగ్ టీజర్ వదిలారు. గతంలో ఫాంహౌజ్ కేసులో బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్నే టచ్ చేయాలని చూశారు. అది వర్కవుట్ కాకపోవడంతో.. మరోఛాన్స్ కోసం ఎదురుచూశారు. ఇప్పుడు పదో తరగతి పేపర్ లీక్ కేసును నేరుగా బండి సంజయ్కు లింక్ చేసి.. అరెస్ట్ చేసి.. లోపలేశారు. కమలనాథులకు వార్నింగ్ మెసేజ్ ఇచ్చారు.
బెదిరిస్తే భయపడిపోతారా? అసలే బీజేపీ. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ. మీ ఇంటికొస్తాం.. మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం.. అంటే చూస్తూ ఊరుకుంటుందా? అసలే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాకు యాక్షన్ హీరోగా పేరుంది. కేసీఆర్ ఇచ్చిన రియాక్షన్కు ఎలాంటి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలో వారికి బాగానే తెలుసుంటుంది. బండి సంజయ్ అరెస్ట్ విషయం తెలిసి.. పార్లమెంట్ ప్రాంగణంలో బీజేపీ ఎంపీలు నిరసన తెలిపారు. స్పీకర్ను కలిసి ప్రివిలైజ్ నోటీస్ ఇచ్చారు. ఇష్యూను నేషనల్ లెవెల్కి తీసుకెళ్లారు.
అటు, అమిత్షా, జేపీ నడ్డాలు అత్యవసరంగా భేటీ అయ్యారు. బండి అరెస్ట్పై చర్చించారు. బీజేపీ తెలంగాణ ఇంఛార్జ్ తరుణ్చుగ్ రాష్ట్ర నేతలతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. కార్యకర్తల్లో మనోబలం నింపేలా.. గురువారం సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమం చేపట్టనున్నారు.
కేసీఆర్కు దూకుడెక్కువ. అదే ఆయన బలం, బలహీనత కూడా. తెలంగాణలో వర్కవుట్ అయింది కాబట్టి.. అంతటా చెల్లుబాటు అవుతుందంటే కుదరకపోవచ్చు. బీఆర్ఎస్తో ఢిల్లీపై దండయాత్ర చేయాలని భావించడం వరకూ ఓకే. ఇలా విపక్ష నేతలకు ఏదోఒక కేసు ముడిపెట్టి అరెస్ట్ చేస్తామంటే కుదురుతుందా? కేసీఆర్ చేసినట్టే.. కేంద్రం కూడా దూకుడుగా వ్యవహరిస్తే? ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పూర్తిగా ఇరుక్కుపోయి ఉన్నారంటున్నారు. అటు, తీహార్ జైల్లో ఉన్న సుఖేశ్ సైతం బీఆర్ఎస్కు 75 కోట్లు ఇచ్చానంటున్నాడు. మరి, ఆ కేసుల్లో ఉచ్చు బిగిస్తే? కేసీఆర్ తట్టుకోగలరా? ఎందుకొచ్చిన ఈ రాజకీయ పోరాటం? ఆరాటం? ఎవరికి లాభం? ఇంకెవరికి నష్టం? ఇప్పటికే తెలంగాణకు కేంద్రం నుంచి ఎలాంటి సహాయం అందట్లేదని కేసీఆర్, కేటీఆర్, హరీశ్ పదే పదే విమర్శిస్తున్నారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య ఉన్న పగ, ప్రతీకారాలు.. పరోక్షంగా ప్రజలపై ప్రభావం చూపట్లేదా? అంతిమంగా నష్టపోయేది ప్రజలేగా?
తెలంగాణ రాజకీయం అచ్చం బెంగాల్ తరహాలోనే నడుస్తున్నట్టు కనిపిస్తోంది. అధికారపార్టీ వర్సెస్ బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. పవర్ ఉంది కాబట్టి అప్పర్ హ్యాండ్ బీఆర్ఎస్దే అయినట్టు అనిపించినా.. ఆ మేరకు కమలం పార్టీ బాగా బలపడుతోంది. ఎంతటి ఘర్షణ వాతావరణం ఉంటే.. బీజేపీకి అంత లాభం. వివాదాల నుంచే కమలం వికసిస్తుంటుంది. తెలంగాణలోనూ అదే జరుగుతోందని అంటున్నారు. అలా, కమల వ్యూహంలో కేసీఆరే చిక్కుకున్నారా? లేదంటే, కాషాయ పార్టీకి కేసీఆరే చిక్కులు సృష్టిస్తున్నారా? ఏమో.