Pawan Kalyan: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రెండు రోజుల తర్వాత అపాయింట్ మెంట్ దొరకడంతో నడ్డా నివాసంలోనే ఆయనతో సమావేశం అయ్యారు జనసేనాని. పవన్ తో పాటు నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యానికి కట్టుబడి ఉన్నామన్నారు జనసేనాని. అధికారాన్ని ఎలా సాధించాలనే లక్ష్యంగానే తమ మధ్య చర్చలు జరిగాయని చెప్పారాయన.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే మాటకు కట్టుబడి ఉన్నానన్నారు పవన్. తన ఢిల్లీ పర్యటన సత్ఫలితాలు ఇస్తుందని భావిస్తున్నా అన్నారు. రాబోయే రోజుల్లో అన్ని విషయాలు చెప్తానన్నారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు.. వైసీపీని గద్దె దించాలి.. నడ్డాతో మీటింగ్ తర్వాత పవన్ చెప్పిన మాటలివే. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అంటే.. విపక్షాలన్నీ ఏకమవ్వాలి.. అంటే.. టీడీపీని కూడా కలుపుకుని వెళ్తారా? ఆ దిశగానే నడ్డా – పవన్ మధ్య చర్చలు జరిగాయా అనే విశ్లేషణలు మొదలయ్యాయి.
ఏపీలోని జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు బీజేపీ తనకు రోడ్ మ్యాప్ ఇవ్వలేదని పవన్ గతంలో ఆరోపించారు. రెండు రోజుల తన ఢిల్లీ పర్యటనలో బీజేపీ నుంచి రోడ్ మ్యాప్ అందిందా? రెండు పార్టీల లక్ష్యం వైసీపీని గద్దె దించి.. అధికారాన్ని సొంతం చేసుకోవడమే అంటున్నారాయన. అది ఎలా అనేది మాత్రం చెప్పలేదు.