TSPSC: రేవంత్రెడ్డికి అన్నీ ముందే అలా తెలిసిపోతాయి కాబోలు. లేదంటే.. ఆయన చెప్పింది చెప్పినట్టు జరుగుతుండటం ఏంటి? టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటనలో మొదట్లోనే పీసీసీ చీఫ్ పలు సంచలన ఆరోపణలు చేశారు. లీకేజీ వెనుక కేటీఆర్ పీఏ తిరుపతి హస్తం ఉందని అన్నారు. తిరుపతి స్వగ్రామం జగిత్యాల జిల్లా మల్యాలలో.. గ్రూప్ 1 పరీక్షలో 100 మందికి 100కు పైగా మార్కులు వచ్చాయని కలకలం రేపారు. రేవంత్ ఆరోపణలపై విమర్శలు కూడా వచ్చాయి. పొలిటికల్ అడ్వాంటేజ్ కోసమే ఆయనిలాంటి వ్యాఖ్యలు చేశారని అన్నారు. సిట్ సైతం రేవంత్రెడ్డికి నోటీసులు ఇచ్చి ఆధారాలు చూపించాలంది. రేవంత్ సిట్ విచారణకు హాజరై తన దగ్గరున్న సమాచారం మొత్తం చెప్పేశారు.
కట్ చేస్తే, రేవంత్రెడ్డి చెప్పింది దాదాపు నిజమైంది. కేటీఆర్ పీఏ తిరుపతి స్వగ్రామమైన మల్యాల మండలంలో.. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో.. సుమారు 50 మందికి.. 100కు పైగా మార్కులు వచ్చాయని తేలింది. విషయం తెలిసి సిట్ షాక్. హడావుడిగా మల్యాలలో స్పెషల్ రైడ్ చేపట్టింది. ఐదు బృందాలుగా విడిపోయి.. గ్రూప్ 1 రాసిన అభ్యర్థులను ప్రశ్నించారు.
గ్రూప్ 1 ప్రిలిమ్స్కు అర్హత సాధించిన వారి ఇళ్లకు వెళ్లి పూర్తి వివరాలు సేకరించారు. అభ్యర్థుల విద్యార్హతలు, గ్రూప్-1 ప్రిలిమ్స్లో వచ్చిన మార్కులు, ఎక్కడ శిక్షణ తీసుకున్నారు, కుటుంబ సభ్యుల వివరాలు, బంధువులు, స్నేహితుల సమాచారం సేకరించారు. ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో నిందితుడిగా ఉన్న రాజశేఖర్ రెడ్డితో అభ్యర్థులకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలోనూ ఆరా తీశారు. మరి, మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతితో వీరికి పరిచయం ఉందా? అనే యాంగిల్లో అడిగారో లేదో?
TSPSC పేపర్ లీక్ అయిన వెంటనే రేవంత్రెడ్డి మల్యాల మండలం గురించి చెప్పారు. పీసీసీ చీఫ్గా ఉన్న వ్యక్తి ఒక్క రోజులోనే ఇంత పక్కాగా సమాచారం సేకరిస్తే.. మరి సిట్ బృందం మల్యాల వరకూ చేరుకోవడానికి వారంపైనే పట్టింది. కన్ఫామ్ చేసుకున్నాకే ప్రశ్నించాలని అనుకున్నారో? లేదంటే, కావాలనే ఆలస్యం చేశారో తెలీదు కానీ.. రేవంత్ చెప్పినట్టే మల్యాలలో పేపర్ లీక్ లాగుతుంటే.. మరి డొంక ఎక్కడ కదులుతుందో?
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజశేఖర్రెడ్డికి.. టీఎస్పీఎస్సీలో ఉద్యోగంలో పెట్టించింది మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతినే అని కూడా రేవంత్రెడ్డి గతంలో ఆరోపించారు. అది కూడా నిజమని తేలితే..? పేపర్ లీక్ కేసు కేటీఆర్ వరకూ వెళుతుందా? రేవంత్రెడ్డి డిమాండ్ చేస్తున్నట్టు.. మంత్రి కేటీఆర్కూ సిట్ నోటీసులు ఇచ్చి ప్రశ్నిస్తుందా?