Jagan : ఏపీ సీఎం జగన్ గేర్ మార్చారు. టీడీపీ దూకుడుకు బ్రేకులు వేసేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈ క్రమంలోనే వరుస సమావేశాలతో బిజీబిజీగా ఉంటున్నారు. సోమవారం వైసీపీ ఎమ్మెల్యేలతో సమావేశమైన జగన్.. మంగళవారం రీజినల్ కో ఆర్డినేటర్లతో కీలక సమావేశం నిర్వహించారు. ఇక ఈ మీటింగ్లో రాబోయే రోజుల్లో చేయాల్సిన కార్యక్రమాలపై రీజనల్ కోఆర్డినేటర్లకు దిశా నిర్దేశం చేశారు. త్వరలో ప్రారంభించే కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేవిధంగా.. రీజనల్ కోఆర్డినేటర్స్ పనిచేయాలని ఆదేశించారు.
వైసీపీ శాసన సభ్యులతో సోమవారం సమావేశమైన సీఎం జగన్.. అదే ఊపులో రీజినల్ కో-ఆర్డినేటర్లతో సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ కార్యకలాపాలను మరింత వేగవంతం చేయటం.. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఇంచార్జ్లతోపాటుగా పార్టీలోని సీనియర్లను కలుపుకొని వ్యూహాత్మకంగా స్థానిక పరిస్థితులను ఏప్పటికప్పుడు అంచనా వేసుకొని.. రాజకీయం నడిపంచటం వంటి అంశాల పై జగన్ దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.
పార్టీ కార్యక్రమాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టి ఎమ్మెల్యేలతో రోజు టచ్లో ఉండేలా రీజినల్ కోఆర్డినేటర్లకు సీఎం జగన్ బాధ్యతలు అప్పగించనున్నారు. వాలంటీర్లు, గృహ సారథులును సమన్వయం చేసుకుని కార్యక్రమాలపై దృష్టి పెట్టేలా చూడాలన్నారు. త్వరలో ప్రారంభం అయ్యే జగనన్నే మన భవిష్యత్.. జగనన్నకు చెబుదాం కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జగన్ రీజనల్ కో-ఆర్డినేటర్లకు దిశానిర్దేశం చేశారు. సీఎం జగన్ జిల్లా పర్యటనలో కూడా ఎమ్మెల్యేలు స్థానిక నేతలను సమన్వయం చేసుకునేలా రీజనల్ కో-ఆర్డినేటర్లకు బాధ్యతలు అప్పగించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తరువాత జగన్ మరింత అప్రమత్తం అయ్యారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. మరో ఏడాదిలో ఎన్నికలు ఉంటాయని స్పష్టం చేసిన జగన్.. ఆ దిశగా పార్టీని మరింతగా సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు చేపట్టారు. అధికారిక కార్యక్రమాల్లో మార్పులు తీసుకువచ్చి, పార్టీకి ఎక్కువ సమయం ఇచ్చేలా జగన్ రూట్ మ్యాప్ను సిద్ధం చేశారని సమాచారం. దీంతో పాటుగా రాబోయే రోజుల్లో ఎన్నికలకు సంబంధించిన అంశాలు కీలకంగా మారుతున్న పరిస్థితుల్లో.. పార్టీలో నాయకత్వం, నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఇంచార్జ్ల పనితీరు వంటి వివరాలను జగన్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఏపీలో టీడీపీ దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో జగన్ అప్రమత్తమయ్యారు. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. పైకి షెడ్యూల్ ప్రకారమే ఎన్నికల జరుగుతాయని సీఎం చెబుతున్నా.. ముందుస్తు ఆలోచన మనసులో ఉందా..? తెలంగాణతోపాటే ఏపీలో ఎన్నికలు జరగనున్నాయా? అందుకే జగన్ పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారా..?