Telangana : తెలంగాణలో పదో తరగతి పరీక్ష ప్రశ్నాపత్రాల లీకులు కలకలం రేపుతున్నాయి. తొలిరోజు తెలుగు పరీక్ష ప్రారంభమైన 7 నిమిషాలకే ప్రశ్నాపత్రం వాట్సాప్ ల్లో చక్కర్లు కొట్టింది. రెండోరోజూ హిందీ పేపర్ లీకైందని వార్తలు వచ్చాయి. వరంగల్ జిల్లాలో హిందీ పేపర్ ఉదయం 9.30 గంటలకే టెన్త్ విద్యార్థులకు చెందిన వాట్సాప్ గ్రూపుల్లో పేపర్ చక్కర్లు కొట్టిందని తెలుస్తోంది.
వరంగల్ జిల్లాలో పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం వాట్సాప్లో చక్కర్లు కొట్టిందని జరుగుతున్న ప్రచారంపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. ఈ విషయంపై విద్యాశాఖ ఉన్నతాధికారులను ఆరా తీశారు. ప్రశ్నపత్రం లీక్ కాలేదని వరంగల్, హన్మకొండ జిల్లాల డీఈవోలు మంత్రికి వివరణ ఇచ్చారు. నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు వరంగల్ సీపీకి ఫిర్యాదు చేయాలని డీఈవోలను మంత్రి సబిత ఆదేశించారు.
సోమవారం తాండూరులో పదో తరగతి తెలుగు ప్రశ్నాపత్రం బయటకు వచ్చింది. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయుడు బందెప్ప తన సెల్ఫోన్ నుంచి మరో ఉపాధ్యాయుడికి పంపడంతోపాటు ఓ వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేసినట్లు పోలీసులు, విద్యాశాఖ అధికారులు గుర్తించారు. తొలుత అదే మండలంలోని చెంగోల్ ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయుడు సమ్మప్పకు పంపారు. ఆ తర్వాత ఓ వాట్సాప్ గ్రూప్లోనూ పోస్ట్ చేశారు. ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనపై వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి చర్యలు తీసుకున్నారు. ఉపాధ్యాయులు బందెప్ప, సమ్మప్పలతోపాటు పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ గోపాల్, డిపార్ట్మెంటల్ అధికారి శివకుమార్లను సస్పెండ్ చేశారు.
మరోవైపు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో సోమవారం తెలుగు పరీక్ష రాసిన విద్యార్థుల జవాబు పత్రాల్లో ఒక కట్ట మాయమైంది. ఈ జవాబు పత్రాల కట్ట ఏ పరీక్ష కేంద్రానికి సంబంధించిందో తేల్చాల్సిఉంది. ఉట్నూరులో పరీక్ష రాసేందుకు 1,011 మంది విద్యార్థులకు 5 కేంద్రాలను ఏర్పాటు చేశారు. జవాబుపత్రాలను ఆయా కేంద్రాల బాధ్యులు తపాలా కార్యాలయంలో అప్పజెప్పారు. అక్కడి సిబ్బంది ఆ పత్రాలను 11 కట్టలుగా విభజించి మూల్యాంకన కేంద్రాలకు తరలించేందుకు బస్టాండ్కు ఓ ఆటోలో తీసుకొచ్చారు. బస్సులో వేసే ముందు మరోసారి కట్టలను లెక్కించారు. పది కట్టలే ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సైన జవాబు పత్రాల కట్ట కోసం ప్రధాన రహదారితోపాటు అన్ని ప్రాంతాల్లోనూ వెతికారు. అది దొరక్కపోవడంతో తపాలా కార్యాలయ సబ్ పోస్టుమాస్టర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు నిర్వహణపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.