Ganga Pushkars : ఈ ఏడాది ఏప్రిల్ 22 వ తేదీ నుంచి మే 3వ తేదీ వరకూ గంగానదికి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. గంగా పుష్కరాలు బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పుడు మొదలవుతాయి. బృహస్పతి పన్నెండో రాశి అయిన మీనంలో ప్రవేశించినప్పుడు గంగా పుష్కరం పూర్తి అవుతుంది. పుష్కరకాలము సాధారణముగా ఒక సంవత్సరము పాటు ఉంటుంది. అయితే పుష్కరకాలములోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరము అని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరము అని వ్యవహరిస్తారు. ఈ మొదటి, చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి. బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పటి నుంచి 12 రోజుల పాటు గంగా నదికి పుష్కరుడు సకలదేవతలతో కలిసి వచ్చి ఉంటాడని ఈ పన్నెండు రోజులలో గంగా నదిలో స్నానం చేయటం వలన సకల తీర్థాలలో స్నానం చేసిన ఫలితం దక్కుతుందని విశ్వాసం.
భారతదేశంలోని నదులలో గంగానది అతి ముఖ్యమైనది, అత్యంత పవిత్రమైనది. హిందువులందరికీ పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. గంగానది స్మరణతోనే సమస్త పాపాలు నశిస్తాయని సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. బలిచక్రవర్తి యాగము చేసే సమయములో శ్రీ మహావిష్ణువు వటు రూపములో వస్తాడు. మహాదాత అయిన బలిచక్రవర్తిని వటుడు మూడు అడుగుల నేలను దానం చేయమని అడగగా…బలిచక్రవర్తి మూడడుగుల నేలను దానము చేస్తాడు. అంతట వామనుడు ముందడుగుతో భూలోకమును, రెండో అడుగుతో ఆకాశాన్ని ఆక్రమిస్తాడు. వామనుడు మూడో అడుగును బలి తలపై నిలిపి అతనిని పాతాళమునకు అణచివేసేను.
బ్రహ్మ తన కమండలములోని జలంతో వామనుని పాదమును కడిగెను. ఆ జలమే మరింత పవిత్రమై ఆకాశగంగా రూపంలో మారి ప్రవహించి శ్రీహరి కీర్తి వలె ముల్లోకములను పవిత్రం చేసిందని భాగవతం చెబుతోంది. గంగానది శ్రీకృష్ణుని యొక్క దేహం నుండి పుట్టినదని బ్రహ్మవైవర్త పురాణంలోను, నారద పురాణంలోను, భాగవతం ఐదవ స్కందంలోను ప్రస్తావించారు.గంగాదేవి తొలిజన్మలో కర్దమ పుత్రికయైన కళకు మరీచునకు పుట్టిన కుమార్తె. అపుడామె పేరు పూర్ణిమ. ఆమెయే మరుసటి జన్మలో శ్రీహరి పాదముల నుండి గంగ అను పేరుతో పుట్టినది. పూర్ణిమకు విరజుడు, విశ్వగుడు అనే ఇరువురు కుమారులు, దేవకుల్య అనే పుత్రికలు జన్మించారని భాగవతం నాలుగవ స్కందం 13, 14 శ్లోకాలలో చెప్పబడింది
స్కందపురాణాన్ని బట్టి గౌరవర్ణంలో ప్రకాశిస్తున్న హిరణ్యశృంగ పర్వతమే గౌరీపర్వతము అని తెలుస్తోంది. గౌరీదేవి నివాసమున్న పర్వతం కిందనే ఈ సరస్సు ఉండటం వలన ఇది గౌరీకుండంగా ప్రసిద్ధమైంది. దీనినే మత్స్యపురాణంలో బిందుసరస్సుగా అభివర్ణించారు