10th Exams: వికారాబాద్లో టెన్త్ క్వశ్చన్ పేపర్ లీక్.. ఆదిలాబాద్లో జవాబు పత్రాలు మాయం. ప్రస్తుతం ఈ రెండు ఘటనలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. ఫస్ట్ ఎగ్జామ్ రోజే ఉట్నూర్లో ఆన్సర్ షీట్స్ మాయం కావడం కలకలం రేపుతోంది.
ఉట్నూర్లో మొత్తం 5 సెంటర్లలో విద్యార్థులు టెన్త్ ఎగ్జామ్స్ రాశారు. పరీక్ష అయిపోయాక జవాబు పత్రాలను అధికారులు పోస్ట్ ఆఫీస్లో అప్పజెప్పారు. పోస్ట్ సిబ్బంది జవాబు పత్రాలను 11 కట్టలుగా వేరు చేశారు. ఇన్విజిలేషన్ కార్యాలయానికి తరలించేందుకు ఆటోలో బస్టాండ్కు తీసుకెళ్లారు. ఈక్రమంలో ఓ ఆన్సర్ షీట్స్ బండిల్ మిస్ అయింది.
వెంటనే పోస్టుమాస్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు పోస్టాఫీస్ నుంచి బస్ స్టేషన్ వరకు గాలించారు. అయినా కూడా ఎక్కడా పేపర్ బండిల్ కనిపించలేదు. దీంతో కేసు నమోదు చేశారు.
ఇక ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే జవాబు పత్రాలు మాయమయ్యాయని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. జవాబు పత్రాలు మాయం కావడంతో నష్టపోయిన విద్యార్థులకు ఎటువంటి పరిష్కార మార్గం చూపిస్తారని నిలదీస్తున్నారు.