Rover:- చంద్రుడిపై జరిగే పరిశోధనల వేగం పెరిగింది. ప్రస్తుతం చాలావరకు ప్రపంచదేశాల పరిశోధకులు టార్గెట్ మూన్. చంద్రుడిపై జీవనం కొనసాగించవచ్చా, అక్కడ ఎప్పటికప్పుడు జరుగుతున్న మార్పులు ఏంటి లాంటి విషయాలను కనుక్కోవడానికి ఆస్ట్రానాట్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అంతే కాకుండా స్పేస్ టూరిజం టార్గెట్ కూడా చంద్రుడే. తాజాగా స్పేస్ ఎక్స్ కూడా ఒక స్టైలిష్ రోవర్ను చంద్రుడిపైకి పంపించాలనే ఆలోచనలో ఉన్నట్టు ప్రకటించింది.
స్పేస్ ఎక్స్ సంస్థ ఇప్పటికే ఎన్నో స్పేస్ పరిశోధనలను సాధ్యం చేసి చూపించింది. అంతే కాకుండా లేటెస్ట్ టెక్నాలజీని వినియోగిస్తూ పెద్ద సంస్థల నుండి భారీ పెట్టుబడులను అందుకుంటోంది. స్టార్షిప్ లాంచ్.. స్పేస్ ఎక్స్కు కొత్త ఊపునిచ్చింది. అందుకే అదే ఊపులో మరో కొత్త ప్రయోగానికి స్పేస్ ఎక్స్ సిద్ధమయ్యింది. ఆస్ట్రోల్యాబ్కు చెందిన ఫ్లెక్సిబుల్ లాజిస్టిక్స్ అండ్ ఎక్స్ప్లోరేషన్ (ఫ్లెక్స్) అనే రోవర్ను చంద్రుడిపైకి పంపించాలని స్పేస్ ఎక్స్ నిర్ణయించుకుంది. 2026లో ఈ మిషన్ జరగనుంది.
ఫ్లెక్స్ రోవర్ అనేది రోవర్, కార్గో మాస్ కలిసిన సామర్థ్యంతో పనిచేస్తుంది. ఇప్పటివరకు చంద్రుడిపై జరగని ఎన్నో సైంటిఫిక్ ప్రయోగాలను, పరిశోధనలు చేయడానికి, చంద్రుడిపై కమర్షియల్ ప్రయత్నాలు చేయడానికి ఫ్లెక్స్ ఎన్నో విధాలుగా ఉపయోగపడనుంది. ఇప్పటివరకు ఎన్నో రోవర్స్ చంద్రుడిపై అడుగుపెట్టి ఎన్నో ప్రయోగాలు చేశాయి. కానీ వాటన్నింటితో పోలిస్తే ఫ్లెక్స్ కాస్త భిన్నంగా ఉంటుందని స్పేస్ ఎక్స్ యాజమాన్యం అంటోంది. ఫ్లెక్స్ అనేది కేవలం రోవర్ మాత్రమే కాదని.. ఇది చంద్రుడిపై, మార్స్పై పనిచేసే లాజిస్టిక్స్ మిషిన్ అని ఆస్ట్రోల్యాబ్ అంటోంది.
చంద్రుడిపై మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం, టెక్నాలజీని కనిపెట్టడం, హై క్వాలిటీ సైన్స్ ప్రయోగాలను చేయడం.. ఇలాంటి వాటి కోసమే ప్రత్యేకంగా ఫ్లెక్స్ రోవర్ తయారు చేయబడిందని ఆస్ట్రోల్యాబ్ తెలిపింది. ఇప్పటికే ఆస్ట్రోల్యాబ్ పలు పేలోడ్స్ను చంద్రుడిపైకి పంపిస్తానని పలు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. కొన్ని రోజుల్లో ఈ ఒప్పందాలకు సంబంధించిన సమాచారాన్ని అధికారికంగా ప్రకటించనుంది. ఈ ఫ్లెక్స్లో ఇద్దరు ఆస్ట్రానాట్స్ చంద్రుడిపైకి ప్రయాణించే అవకాశం కూడా ఉంటుందని ఆస్ట్రోల్యాబ్ బయటపెట్టింది.
మనిషిలోని వ్యక్తిత్వాన్ని చంపేస్తున్న టెక్నాలజీ..
for more updates follow this link:-Bigtv