Delhi: ఏపీ పాలిటిక్స్ ఇప్పుడు ఢిల్లీ చుట్టు చక్కర్లు కొడుతున్నాయి. అవును సీఎం జగన్ రెండు వారాల వ్యవధిలో రెండుసార్లు హస్తిన వెళ్లగా, ఇప్పుడు పవన్ వంతు వచ్చింది. కేంద్ర పెద్దలతో వైఎస్ జగన్ మంచి సంబంధాలనే కోరుకుంటున్నారు. బీజేపీ-వైసీపీ బంధం వచ్చే రోజుల్లో ఏ దిశగా సాగుతుందన్న చర్చ కూడా జరుగుతోంది. ప్రతి విషయంలో కేంద్ర ప్రభుత్వానికి జగన్ సర్కారు సపోర్ట్ చేస్తోంది. అది ఎన్నికల్లో ఏ మేరకు అవగాహన దిశగా ఉంటుందన్న చర్చ జరుగుతోంది. మోదీ, అమిత్ షా ఈ విషయంలో జగన్ కు ఎలాంటి దిశానిర్దేశం చేసి ఉంటారన్న టాక్ కూడా నడుస్తోంది.
మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. బీజేపీ-జనసేన పొత్తు ఉన్నట్టా లేనట్టా అన్న డౌట్లు కొనసాగుతున్న టైంలో పవన్ హస్తిన టూర్ చాలా అంశాలను తెరపైకి తెచ్చినట్లయింది. గతంలో బీజేపీతో కలిసి పనిచేస్తామని పవన్ చెప్పిన తర్వాత.. ఎలా ముందుకెళ్లాలన్న విషయంపై రోడ్మ్యాప్ ఇస్తామని బీజేపీ హైకమాండ్ చెప్పింది. అయితే ఆ రోడ్ మ్యాప్ బీజేపీ హైకమాండ్ ఇప్పటి వరకు ఇవ్వలేదని పవన్ ఇటీవలే పార్టీ ఆవిర్భావ సభలో క్లారిటీ ఇచ్చారు. ఇంకోవైపు మరోవైపు రాబోయే ఎన్నికల్లో టీడీపీతో కలిసి ముందుకెళ్లాలన్న ప్రతిపాదనలు జనసేన ముందు ఉన్నాయి. ఇటీవలే పవన్… చంద్రబాబుతో భేటీ కూడా అయ్యారు. అయితే బీజేపీతో బంధంపై క్లారిటీ వస్తే తదుపరి కార్యాచరణపై ఫోకస్ పెట్టే అవకాశం ఉందంటున్నారు.
ఏపీలో టీడీపీ – బీజేపీ దోస్తీపై ఒక క్లారిటీ లేదు. అదే సమయంలో టీడీపీ-జనసేన పొత్తులపైనా స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో ఢిల్లీ బీజేపీ పెద్దలు పవన్ కు చెప్పిన విషయాలు ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారబోతున్నాయి. ఇప్పుడు పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తుకు సై అంటారా.. లేక బీజేపీతోనే కలిసి వెళ్తారా అన్న చర్చ జరుగుతోంది. ఏపీలో బీజేపీ, జనసేన మధ్య సఖ్యత లేదని, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన ఓటు బీజేపీకి పడలేదంటూ మాజీ ఎమ్మెల్సీ మాధవ్ బహిరంగంగానే ఆరోపించారు. అసలు జనసేనతో పొత్తు ఉందా అంటూ అనుమానం వ్యక్తం చేశారు. జనసేనతో పొత్తు ఉన్నా లేనట్టే అంటూ మాధవ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పవన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యంగా మారింది. ఫైనల్ గా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలొద్దంటున్నారు జనసేనాని. అదే సమయంలో ఢిల్లీ బీజేపీతో వైసీపీ, టీడీపీ, జనసేన క్లోజ్ గా మూవ్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ఇందులో బీజేపీ దారి ఎటు అన్నది కీలకంగా మారుతోంది.