Rahul Gandhi: పరువునష్టం కేసులో రాహుల్గాంధీకి బెయిల్ వచ్చింది. ఏప్రిల్ 13 వరకు రాహుల్కు బెయిల్ మంజూరు చేసింది సూరత్ సెషన్స్ కోర్టు. పరువునష్టం కేసులో ట్రయల్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను రద్దు చేయాలంటూ సెషన్స్ కోర్టులో అప్పీల్ చేశారు రాహుల్గాంధీ. ఈ కేసులో ఈనెల 13 వరకు బెయిల్ ఇచ్చింది కోర్టు. ఆ రోజున పిటిషన్పై విచారణ చేపడతామని తెలిపింది.
ఇక, రాహుల్ వెంట సోదరి ప్రియాంక సైతం సూరత్ కోర్టుకు వచ్చారు. మరోవైపు, రాహుల్గాంధీకి మద్దతుగా దేశ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు కోర్టుకు తరలివచ్చారు. రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్, ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ తో పాటు పలు రాష్ట్రాల ముఖ్య నాయకులు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తదితరులు రాహుల్తో పాటు ఉన్నారు. కోర్టు పరిసర ప్రాంతాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
మరోవైపు రాహుల్ సూరత్ కోర్టుకు రావడంపై బీజేపీ విమర్శలు చేసింది. భారీగా కార్యకర్తలతో రాహుల్ సూరత్ కోర్టుకు చేరుకోవడంపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు విమర్శలు చేశారు. రాహుల్ బలప్రదర్శన చేస్తున్నారని.. ఆయన కోసమే కాంగ్రెస్ పార్టీ నాటకాలాడుతోందన్నారు. ఓ రకంగా న్యాయవ్యవస్థపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు రిజిజు. వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన సమయంలో రాహుల్ హాజరుకాలేదని.. కానీ రాజకీయంగా లబ్ధి పొందడానికి నేడు భారీగా అనుచరులతో కోర్టుకు వచ్చారన్నారు రిజిజు.
అయితే న్యాయ వ్యవస్థను, న్యాయమూర్తులను రోజూ బెదిరించే వ్యక్తి న్యాయవ్యవస్థ గురించి మాట్లాడటం ఏంటని కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేత జైరాం రమేశ్. రాహుల్ ది బలప్రదర్శన కాదని.. కేవలం మద్దతంటూ కౌంటర్లు ఇస్తున్నారు.
గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్.. మోడీ అనే పేరుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయనపై పరువునష్టం దావా వేశారు. క్షమాపణలు చెప్పేందుకు రాహుల్ నిరాకరించడంతో.. రెండేళ్ల జైలు శిక్ష విధించింది సూరత్ ట్రయల్ కోర్టు. కోర్టు ఆదేశాలు వచ్చిన 24 గంటల్లోనే.. ఎంపీగా రాహుల్ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ లోక్సభ సచివాలయం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ వెంటనే ఆయన ఉంటున్న బిల్డింగ్ కూడా ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రాహుల్పై వేటు వేయడాన్ని కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నాయి. జైలు శిక్షపై అప్పీల్కు 30 రోజులు గడువు ఇవ్వగా.. తాజాగా సూరత్ సెషన్స్ కోర్టులో తనపై విధించిన శిక్షను రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు రాహుల్గాంధీ. ప్రస్తుతం అయితే బెయిల్ వచ్చింది. మరి, శిక్ష రద్దు ఏమవుతుందో అనే టెన్షన్ హస్తం నేతల్లో కనిపిస్తోంది.