Revanth : తెలంగాణలోకి రాహులొచ్చినాడు. భారత్ జోడో యాత్ర జోష్ మామూలుగా లేదు. మొదటి రోజే గ్రాండ్ వెల్ కమ్ తో సత్తా చాటింది టి-కాంగ్. రేవంత్ రెడ్డి జాతీయ జెండా చేతపట్టి రాహుల్ తో పాటు వడివడిగా అడుగులు వేశారు. నవంబర్ 7 వరకూ తెలంగాణలోనే యాత్ర కొనసాగనుంది. రాహుల్ రాకతో పార్టీ ఫోకస్ అంతా అటువైపు మళ్లింది. సీనియర్లంతా బలప్రదర్శనకు సిద్ధమయ్యారు. భారత్ జోడో సంగతి సరే.. మరి మునుగోడు పరిస్థితి ఏంటి? ఇప్పటికే సీనియర్లు తనకు సహకరించట్లేదని.. తనకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారంటూ స్వయంగా పీసీసీ అధ్యక్షుడే ప్రకటించడం సంచలనంగా మారింది. ఇలాంటి సమయంలో.. రాహుల్ పాదయాత్ర ఎఫెక్ట్ మునుగోడుపై ఏ మేరకు ఉంటుందనేది ఆసక్తికరం. అదే అత్యంత కీలకం కూడా.
రాహుల్ చేస్తున్న భారత్ జోడో యాత్రం తప్పనిసరిగా విజయవంతం కావాల్సిందే. అది ఎంత సక్సెస్ అయితే కాంగ్రెస్ కు అంత జోష్. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మరింత ఇమేజ్. ఇప్పటికే కేరళ, తమిళనాడు, కర్నాటకలో భారత్ జోడో యాత్రకు మంచి స్పందన వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉండటంతో.. మరింత గ్రాండ్ సక్సెస్ చేయాల్సిన బాధ్యత రేవంత్ మీదే ఉంది. అదే సమయంలో మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాల్సిన పని కూడా రేవంత్ రెడ్డిదే. ఈ రెండూ దాదాపు ఒకే సమయంలో చేయాల్సి రావడం టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డికి కత్తి మీద సామే. ఆయనకు అగ్ని పరీక్షే.
అయినా, తగ్గేదేలే అంటున్నారు రేవంత్ రెడ్డి. తొలిరోజే భారీ జనసందోహంతో రాహుల్ గాంధీకి ఘనమైన స్వాగతం పలికి శభాష్ అనిపించుకున్నారు రేవంత్. యాత్ర ఆసాంతం తగ్గేదేలే అంటున్నారు. కార్నర్ మీటింగ్ లు, సభలు సక్సెస్ అయ్యేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణలో రాహుల్ యాత్ర జరిగేది 370 కిలోమీటర్లే అయినా.. ఆ ప్రభావం యావత్ రాష్ట్రంపై ఉంటుంది. కాంగ్రెస్ కేడర్ లో ఫుల్ జోష్ పెంచుతుంది. ఇప్పటికే బీజేపీ బాగా హడావుడి చేస్తుండగా.. ఈ సమయంలో చేతి సత్తా చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటు భారత్ జోడో యాత్ర, అటు మునుగోడు ఎలక్షన్ తో కాంగ్రెస్ పూర్వవైభవం దిశగా అడుగులు వేయాల్సిన సమయం ఆసన్నమైంది.