Paper leak : తెలంగాణలో పేపర్ లీకులు ఆగడంలేదు. ఒకవైపు ప్రభుత్వం ఉద్యోగాల పరీక్ష పేపర్ల లీకేజీ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే చాలామంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. TSPSC బోర్డు సభ్యులను విచారించేందుకు సిద్ధమయ్యారు. అయితే తాజాగా టెన్త్ పరీక్ష పేపర్ బయటకు రావడం కలకలం రేపుతోంది.
రాష్ట్రంలో టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయి. తొలిరోజు పరీక్ష ప్రారంభమైన కాసేపటికే పేపర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. వాట్సాప్ గ్రూపుల్లో పదో తరగతి క్వశ్చన్ పేపర్ సర్కులేట్ అయ్యింది. ఉదయం 9.30 గంటలకు పదో తరగతి పరీక్ష ప్రారంభమైంది. ఉదయం 9 గంటల 37 నిమిషాలకు తెలుగు పేపర్ తాండూరులో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.
తాండూర్లోని 1వ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే బందెప్ప అనే బయోసైన్స్ టీచర్ ప్రశ్నపత్రాన్ని తన మొబైల్తొ ఫొటో తీసి ఓ వాట్సాప్ గ్రూప్లో పోస్టు చేశారు. వెంటనే ఆ మెసేజ్ను డిలీట్ చేసినప్పటికీ.. గ్రూప్లో ఉన్న మిగతా సభ్యులు ఇతరులకు షేర్ చేశారు. వాట్సాప్ గ్రూప్లో ప్రశ్నపత్రం చక్కర్లు కొట్టడంతో.. ఎంఈవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు టీచర్ బందెప్పనే పేపర్ లీక్ చేసినట్టు గుర్తించారు. ఈ కేసులో బందెప్పతో పాటు మొత్తం నలుగురిని సస్పెండ్ చేశారు జిల్లా కలెక్టర్.
పదో తరగతి ప్రశ్నపత్రం బయటకు రావడంపై నివేదిక ఇవ్వాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డిని విద్యాశాఖ ఆదేశించింది. ఇన్విజిలేటర్, సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్పై చర్యలు తీసుకున్న విద్యాశాఖ.. వారిని పరీక్షల విధుల నుంచి తప్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణలో మొత్తం 4,94,620 మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,652 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. తొలిరోజు పేపర్ ఇలా బయటకు రావడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.