Margadarshi: మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో ఏపీ సీఐడీ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసులో ఏ-1 చెరుకూరి రామోజీరావు, ఏ-2 శైలజా కిరణ్ గా చేర్చింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ -36 లోని శైలజ నివాసానికి సీఐడీ అధికారులు వెళ్లారు. 4 వాహనాల్లో వచ్చిన 30 మంది అధికారుల బృందం ఆమెను ప్రశ్నిస్తోంది.
గతంలోనే 160 సీఆర్పీసీ కింద శైలజా కిరణ్ కు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఏప్రిల్ 3 లేదా 6న విచారణకు అందుబాటులోని ఉండాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇల్లు లేదా ఆఫీస్లో విచారణకు అందుబాటులో ఉండాలని కోరారు. ఈ క్రమంలో శైలజను విచారిస్తున్నారు.
మార్గదర్శి చిట్ఫండ్ లో అక్రమాలు జరిగాయనేది సీఐడీ ప్రధాన అభియోగం. నిధులు మళ్లించారని ఆరోపణలతోనే ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. అందుకే రామోజీరావు, శైలజను విచారించాలని భావించింది సీఐడీ. ఇప్పటికే మార్గదర్శి చిట్ఫండ్స్ కార్యాలయాల్లో సీఐడీ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. చిట్ఫండ్ చట్టానికి విరుద్ధంగా చందాదారుల సొమ్మును మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్లలో పెట్టుబడులుగా పెట్టారని, ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరిస్తున్నారని సీఐడీ ఆరోపిస్తోంది.
బ్యాలెన్స్ షీట్ సమర్పించకపోవడంతోపాటు చిట్ గ్రూప్లకు చెందిన ఫామ్ 21ను కూడా మార్గదర్శి సమర్పించలేదని సీఐడీ ఆరోపిస్తోంది. మొత్తంగా ఏడు మార్గదర్శి బ్రాంచ్ల్లో తనిఖీలు చేసింది. ఐపీసీ సెక్షన్లు 420, 409, 120 బి, 477 రెడ్విత్ 34, కేంద్ర చిట్ఫండ్స్ చట్టం–1982, ఆర్థిక సంస్థల రాష్ట్ర డిపాజిట్దారుల హక్కుల పరిరక్షణ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసులో ఇప్పటికే సీఐడీ అధికారులు నలుగురు మార్గదర్శి చిట్ఫండ్స్ మేనేజర్లను అరెస్టు చేశారు.
మార్గదర్శి చిట్ ఫండ్స్ బ్రాంచ్ కార్యాలయాల్లో స్టాంపులు–రిజిస్ట్రేషన్లశాఖ గతేడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో, హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయంలో డిసెంబర్ లో సోదాలు చేపట్టింది. ఇప్పుడు శైలజా కిరణ్ ను సీఐడీ విచారిస్తోంది.