RevanthReddy : ప్రస్తుతం కర్నాటకలో ఎన్నికల సందడి నెలకొంది. ఆ రాష్ట్రంలో మే 10న పోలింగ్ జరగనుంది. మే 13న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అక్కడ బీజేపీ, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ నెలకొంది. అలాగే ప్రభుత్వం ఏర్పాటులో జేడీఎస్ కీలకంగా నిలిచే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ కు విజయావశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్నాటక ఎన్నికలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణలో వచ్చినట్లేనని విశ్వాసం వ్యక్తం చేశారు.
రాహుల్గాంధీపై అనర్హత వేటు, అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయడం లాంటి అంశాలపై హైదరాబాద్ లో తెలంగాణ పీసీసీ సర్వసభ్య సమావేశం నిర్వహించి చర్చించింది. ఈ సమావేశంలో రేవంత్రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్ రావ్ ఠాక్రేతోపాటు పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈనెల 7న కులి కుతుబ్షా మైదానంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తామని రేవంత్రెడ్డి ప్రకటించారు. ఈ నెల 8న మంచిర్యాలలో సత్యాగ్రహ దీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు.
ఈనెల 10 నుంచి తిరిగి తన పాదయాత్ర మొదలవుతుందని రేవంత్రెడ్డి తెలిపారు. జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో మిగిలిన నాలుగు అసెంబ్లీ స్థానాలతోపాటు మెదక్ పార్లమెంట్ పరిధిలో పాదయాత్ర చేస్తానని చెప్పారు. గజ్వేల్లో లక్షమందితో నిరుద్యోగ నిరసన సభ నిర్వహిస్తామని వెల్లడించారు. పీసీసీ కార్యవర్గ సమావేశాలు ఇప్పటి వరకు 5 సార్లు జరిగాయని, సమావేశాలకురాని ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను తొలగిస్తామని హెచ్చరించారు.
కర్ణాటక ఎన్నికల ప్రచారానికి వెళ్లే నేతల వివరాలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరారు. ఏప్రిల్ 25 నుంచి మే 6 వరకు కర్ణాటకలో ప్రచారానికి హాజరు కావాలని నాయకులను కోరారు. అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రావడం చాలా ముఖ్యమన్నారు. ప్రజా గాయకుడు గద్దర్ గాంధీభవన్కు వచ్చి పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిని కలిశారు. కర్ణాటక ప్రచారానికి తాను కూడా వస్తానని చెప్పారు. మరి కర్ణాటకలో కాంగ్రెస్ గెలుస్తుందా..? తెలంగాణలోనూ అధికారంలోకి రావడం ఖాయమేనా..?