Tirupati: తిరుపతి జిల్లా చంద్రగిరి పరిధిలోని గంగుడుపల్లెలో అర్ధరాత్రి హత్య కలకలం రేపుతోంది. ఓ వ్యక్తిని కారులో కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు . దీంతో ఆ వ్యక్తి మంటల్లో సజీవదహనమయ్యాడు. మృతుడు సాఫ్ట్వేర్ ఉద్యోగి నాగరాజుగా గుర్తించారు. నాగరాజు తిరుపతి నుంచి బ్రాహ్మాణపల్లికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలిలో గోల్డ్ చైన్, చెప్పులను లభ్యం చేసుకున్నారు. నాగరాజు కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. నాగరాజు మరణవార్త విని కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడు నాగరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
హత్య కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆగంతకుల కోసం గాలిస్తున్నారు. ఘటనాస్థలిలో దొరికిన వస్తువుల ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. పాతకక్షల నేపథ్యంలో హత్య జరిగిందా లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.